రైల్వేలు, పెట్రోల్ బంకుల్లో UPI న్యూ రూల్స్.. పరిమితి దాటితే సైలెంట్ గా బాదుడే
దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)లో నూతన మార్పులు చోటుచేసుకోబోతోన్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఎంపిక చేసిన కొన్ని లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది.. అక్టోబర్ 15 నుండి దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలులోకి రానుంది. దీనివల్ల సాధారణ వినియోగదారులపై ఎలాంటి ఆర్థిక భారం పడదని ఎన్పీసీఐ స్పష్టం చెబుతోంది.
ప్రజలు ఎప్పట్లాగే తమ రోజువారీ యూపీఐ లావాదేవీలను పూర్తిగా ఉచితంగానే నిర్వహించుకోవచ్చు. ఎంపిక చేసిన వ్యాపార లావాదేవీలకు (P2M) మాత్రమే ఈ ఎండీఆర్ ఛార్జీల నిబంధనలు వర్తిస్తాయి. దీనివల్ల చిన్నపాటి లావాదేవీలు నిర్వహించే వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండబోవనీ ఎన్సీపీఐ స్పష్టం చేస్తోంది. దీని ప్రకారం.. వ్యాపార సంస్థలకు చెల్లించే రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని నిర్దుష్ట మర్చంట్ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. ఒక లావాదేవీకి గరిష్ఠంగా రూ. 300 వరకు వసూలు చేస్తారు. రూ. 75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన పెద్ద లావాదేవీలకు మాత్రమే ఈ గరిష్ట ఛార్జీని వర్తింపజేశారు.

రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, పెట్రోల్ బంకులు.. వంటి కొన్ని విభాగాల్లో బిల్లుల చెల్లింపుల నియమాలు భిన్నంగా ఉంటాయి. వీటిల్లో రూ. 2,000 దాటిన ప్రతి యూపీఐ చెల్లింపుపై అయిదు రూపాయలు చొప్పున అదనపు మొత్తాన్ని ఛార్జీగా వసూలు చేస్తారు యూజర్ల వద్ద నుంచి. అంటే.. రూ. 2,000 కంటే ఎక్కువ మొత్తంలో పెట్రోల్ పోయించుకుంటే అదనంగా రూ. 5 లను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్ విషయంలో గరిష్టంగా రూ.75,000, అంతకంటే ఎక్కువ మొత్తంలో లావాదేవీని నిర్వహిస్తే రూ. 300 అదనంగా కట్టాలి.
సాధారణంగా చిన్న చిన్న కొనుగోళ్లు చేసుకునే కోట్లాది మంది వినియోగదారులకు ఈ కొత్త ఎండీఆర్ విధానంతో ఎటువంటి నష్టం లేదని ఎన్సీపీఐ వివరణ ఇస్తోంది. రూ. 2,000 లోపు ఉండే చిన్న లావాదేవీలపై ఎలాంటి ఎండీఆర్ ఛార్జీలు ఉండబోవు. ప్రస్తుతం దేశంలో మొత్తం యూపీఐ పీ2ఎమ్ లావాదేవీలలో సుమారు 95 శాతానికి పైగా ఇలాంటి చిన్న మొత్తాలకు సంబంధించినవే.
పర్సన్ టు పర్సన్ మర్చంట్ (P2PM) కేటగిరీ పరిధి కింద చిరు వ్యాపారులను ఈ కొత్త నిబంధనల పరిధి నుండి పూర్తిగా మినహాయించారు. క్యూఆర్ కోడ్ ఉపయోగించి నెలకు లక్ష రూపాయల వరకు నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు పొండే వ్యాపారులు, తోపుడు బండ్ల యజమానులకు ఎండీఆర్ తాజా నియమాలు వర్తించవు.
చిన్న వ్యాపారులను ప్రోత్సహించే ఉద్దేశంతో డిజిటల్ ఇన్ ఫ్రా విస్తరణకు ఎన్పీసీఐ ఈ ఫండ్ మొత్తాన్ని కూడా బదలాయిస్తుంది. టైర్-3 నగరాలు, గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్ నెట్వర్క్లను బలోపేతం చేయడానికి దీన్ని ఉపయోగిస్తుంది. ఫలితంగా.. మారుమూల గ్రామాలు కూడా యూపీఐ డిజిటల్ పేమెంట్ నెట్వర్క్ పరిధిలోకి వస్తాయనేది ఎన్సీపీఐ వాదన.
The introduction of MDR on large-value UPI transactions (i.e., above ₹2,000) is an important step towards strengthening the long-term sustainability of India’s digital payments ecosystem. It will help UPI in continuing to scale, innovate and serve consumers and businesses across…
— ReserveBankOfIndia (@RBI) September 15, 2026
ప్రస్తుతం యూపీఐ, రూపే ద్వారా జరిగే ఈ డిజిటల్ లావాదేవీల నిర్వహణ వ్యయాన్ని బ్యాంకులు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్, పేమెంట్ కంపెనీలే భరిస్తూ వస్తోన్నాయి. ఇకపై వీటిని నిర్దుష్ట విభాగాల్లో రూ. 2,000 కు పైగా మొత్తంలో లావాదేవీలను నిర్వహించే వినియోగదారులే చెల్లించాల్సి ఉంటుంది. ప్రత్యేకించి.. రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, పెట్రోల్ బంకులు.. ఈ నెట్ వర్క్ పరిధిలోకి వచ్చాయి. ఇక్కడ అధిక మొత్తంలో డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నట్లు ఎన్సీపీఐ గుర్తించింది.
దేశంలో డిజిటల్ లావాదేవీలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 241.6 బిలియన్ల యూపీఐ చెల్లింపులు నమోదయ్యాయి. వాటి మొత్తం విలువ దాదాపు రూ. 314.2 లక్షల కోట్లు. అలాగే ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా యూపీఐ వినియోగదారుల సంఖ్య 55 కోట్లకు చేరుకుంది. ఈ స్థాయిలో చెల్లింపులు పెరగడంతో నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచడం, భద్రత సెక్టార్ను బలోపేతం చేయడం, సైబర్ మోసాలను అరికట్టడం వంటి పనుల కోసం పెద్ద ఎత్తున నిధుల అవసరం ఏర్పడింది.













Click it and Unblock the Notifications
