వాహనదారులకు కేంద్రం భారీ షాక్..! ఫిట్ నెస్ ఫీజులు 10 రెట్లు పెంపు..!
దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్రం ఇవాళ భారీ షాక్ ఇచ్చింది. వాహనాల ఫిట్ నెస్ ఫీజుల్ని భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర రవాణామంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం వివిధ కేటగిరీల్లో ఫీజుల్ని దాదాపు 10 రెట్ల వరకూ పెంచేశారు. దీంతో ఇకపై వాహనాల ఫిట్ నెస్ టెస్టులు భారం కాబోతున్నాయి. కేంద్రం నిర్ణయంపై వాహనదారులు భగ్గుమంటున్నారు.
కేంద్ర మోటారు వాహన చట్టంలోని నిబంధనల్ని సవరిస్తూ ఇవాళ రవాణామంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, లారీలు ఇలా వివిధ కేటగిరీల్లో వాహనాలకు గరిష్టంగా 10 రెట్ల వరకూ ఫిట్ నెస్ టెస్టుల ఫీజుల్ని పెంచేశారు. పదేళ్లు దాటిన వాహనాలకు వివిధ వర్గాలుగా విభజించి మరీ ఈ ఫీజులు వసూలు చేయబోతున్నారు. దీంతో వాహనదారులు ఫిట్ నెస్ టెస్టులు చేయించుకోవాలంటే జేబులకు చిల్లు పడక తప్పేలా లేదు.

అలాగే అధిక ఫిట్నెస్ ఫీజులకు వయో పరిమితిని తగ్గించారు. ఈ సవరణలకు ముందు 15 సంవత్సరాలు దాటిన వాహనాలకు ఏకరీతిలో ఫిట్ నెస్ ఛార్జీలు ఉండేవి. ఇప్పుడు దాన్ని మార్చి ఇప్పుడు 10 సంవత్సరాలు పూర్తి చేసిన వాహనాలకు ఎక్కువ ఛార్జీలు విధించబోతోంది. దీంతో పాటు ప్రభుత్వం వాహనాల కాలాల్ని ప్రవేశపెట్టింది. మొదటిది 10-15 సంవత్సరాలు, రెండవది 15-20 సంవత్సరాలు, మూడవది 20 సంవత్సరాల కంటే పాత వాహనాలు. ఇలా కేటగిరీని బట్టి ఫీజులు పెరగబోతున్నాయి.
20 సంవత్సరాల కంటే ఎక్కువ తిరిగిన ట్రక్కులు లేదా బస్సులు ఇప్పుడు ఫిట్నెస్ పరీక్ష కోసం రూ.25వేలు చెల్లించాలి. ఇది గతంలో రూ.2,500 మాత్రమే ఉండేది. అలాగే 20 ఏళ్లు దాటిన మధ్యస్థ కమర్షియల్ వాహనాలకు రూ.1,800 నుండి రూ. 20,000 వేలకు ఫిట్ నెస్ ఫీజు పెంచేశారు. 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న తేలికపాటి మోటారు వాహనాలకు, ఫీజు 15వేలకు పెంచేశారు. 20 సంవత్సరాల కంటే పాత ఆటోలకు 7వేలకు పెంచారు. 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న బైక్ ల ఫీజు మూడు రెట్లు పెరిగింది. అంటే 600 నుంచి 2 వేలకు పెంచారు. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వాహనాలకు కూడా ఫీజుల్ని పెంచారు. మోటార్ సైకిళ్లకు రూ.400, తేలికపాటి మోటార్ వాహనాలకు రూ.600, మధ్యస్థ , భారీ వాణిజ్య వాహనాలకు రూ. 1,000 ఫిట్నెస్ సర్టిఫికేషన్ కోసం వసూలు చేస్తారు.












Click it and Unblock the Notifications