నైట్ కర్ఫ్యూ రాష్ట్రాల లిస్ట్: భారత్లో కరోనా మరణాల్లో అదే ఉధృతి: లక్షన్నరకు చేరువగా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ మరణాల తీవ్రతలో తగ్గుదల నమోదు కావట్లేదు. రోజూ 300 మందికి పైగా మృత్యువాత పడుతూనే ఉన్నారు. ఒకవంక రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. మరణాలకు బ్రేక్ పడట్లేదు. ఈ పరిస్థితుల్లో బ్రిటన్లో కనిపించిన కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్.. భారత్కూ విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి కాలంలో బ్రిటన్ నుంచి స్వదేశానికి వచ్చిన వారిలో 25 మందికి పైగా కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. కొత్త స్ట్రెయిన్ ఎలాంటి విపరీత పరిస్థితులకు దారి తీస్తుందోననే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.
https://telugu.oneindia.com/new-year/
కొత్తగా 24 వేలకు పైగా..
దేశవ్యాప్తంగా కొత్తగా 24,712 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 312 మంది మరణించారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 1,01,23,778కి చేరుకున్నాయి. ఇందులో 96,93,173 మంది డిశ్చార్జి అయ్యారు. మరణించిన వారి సంఖ్య లక్షన్నరకు చేరువ అవుతోంది. ఇప్పటిదాకా కరోనా బారిన పడి 1,46,756 మంది మృతి చెందారు. 24 గంటల్లో కొత్తగా 29,791 మంది కరోనా బారి నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జి అయ్యారు.
మరణాల్లో అదే తీరు..
ప్రపంచ దేశాల్లో కరోనా మృతుల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతూనే ఉంది. అమెరికా, బ్రెజిల్ తరువాత ఆ స్థాయిలో మరణాలు సంభవించింది భారత్లోనే. అమెరికా-3,34,218, బ్రెజిల్-1,89,264 మంది మరణించారు. భారత్లో 1,46,756 మంది మృతి చెందారు. మెక్సికోలో 1,20,311, ఇటలీలో 70,395 మంది కరోనా కాటుకు బలి అయ్యారు. ఈ పరిణామాల మధ్య బ్రిటన్లో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కనిపించడం కలకలం రేపుతోంది. బ్రిటన్లో ఇప్పటికే కరోనా సోకి 69,051 మంది మృతి చెందగా.. 21,49,551 కేసులు అక్కడ నమోదు అయ్యాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన కొత్త వేరియంట్ క్రమంగా వ్యాప్తి చెందుతోంది.
కొత్త వేరియంట్తో కలకలం
కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు రాత్రి వేళ కర్ఫ్యూను ప్రకటించాయి. కర్ణాటకలో గురువారం రాత్రి నుంచి ఈ నైట్ కర్ఫ్యూ అమల్లోకి రాబోతోంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాజస్థాన్ ప్రభుత్వం కూడా రాత్రివేళ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. ఈ నెల 31వ తేదీన రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారు జామున 6 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయనుంది. కొత్త ఏడాది వేడుకలను పురస్కరించుకుని లక్షలాది మంది రోడ్ల మీదికి వస్తారనే కారణంతో ఆ రోజు నైట్ కర్ఫ్యను విధించింది.
మహారాష్ట్ర కఠినంగా.. కర్ణాటకలో వాహనాల రాకపోకలకు అనుమతి..
రాత్రివేళ విధించిన కర్ఫ్యూను మహారాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వట్లేదు. కరోనా వైరస్ బారిన పడి తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం కావడం వల్ల కరోనా కొత్త వేరియంట్ సందర్భంగా ముందుజాగ్రత్తలను తీసుకుంటోంది. బ్రిటన్ నుంచి వచ్చిన వారిని విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకుని, క్వారంటైన్కు పంపిస్తోంది. గురువారం రాత్రి నుంచి కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాత్రి 11 నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఈ సందర్భంగా వాహనాల రాకపోకలు యధాతథంగా కొనసాగుతాయని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది.
16 కోట్లను దాటిన
మరోవంక- దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటిదాకా 16,53,08,366 కోట్ల నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధికారులు వెల్లడించారు. బుధవారం ఒక్కరోజే 10,39,645 శాంపిళ్లను పరీక్షించామని, కరోనా మరణాల రేటు 1.4 శాతంగా నమోదైనట్లు తెలిపారు. 95.7 శాతం మేర పేషెంట్లు కోలుకుంటున్నారని చెప్పారు.