దేశంలో కరోనా కేసుల విస్ఫోటం: ఒక్కరోజే అరలక్షకు చేరువగా: మరణాల్లో అనూహ్య పెరుగుదల
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ జెట్ స్పీడ్తో పరుగులు పెడుతోంది. అనేక రాష్ట్రాల్లో కరోనా తీవ్రత కనిపిస్తోంది. తెలంగాణలో వైద్య విద్యా కళాశాలలు మినహా అన్ని విద్యాసంస్థలు, పాఠశాలలను మూసివేశారు. ఛత్తీస్గఢ్లో అయిదు రోజుల కిందటే విద్యాసంస్థలు మూతపడ్డాయి. పార్కుల వంటి బహిరంగ ప్రదేశాలకు తాళాలు పడ్డాయి. వారాంతపు రోజుల్లో లాక్డౌన్ను అమలు చేస్తున్నారు. పలు ప్రధాన నగరాల్లో ఆదివారం నాడు సంపూర్ణ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. దీన్ని మరింత విస్తరిస్తున్నారు.
ఈ పరిణామాల మధ్య దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 47,262 కరోనా కేసులు నమోదయ్యాయి. 275 మంది మరణించారు. అటు రోజువారీ కేసుల పెరుగుదలలోనూ, కరోనా మరణాల్లోనూ ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో కొత్త కేసులు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. అరలక్షకు చేరువగా కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 23,907 మంది ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,17,34,058కి చేరుకుంది. ఇందులో 1,12,05,160 మంది డిశ్చార్జ్ కాగా.. 1,60,441 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3,68,457కు చేరింది.
మరో వైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 5,08,41,286 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పలువురు ప్రముఖులు టీకాలను వేయించుకుంటున్నారు. వ్యాక్సిన్ పనితీరుపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్గఢ్లల్లో విద్యాసంస్థలు మూతపడ్డాయి. తాజాగా ఈ జాబితాలో తెలంగాణ చేరింది.
Recommended Video
రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోని పలు నగరాల్లో ఆదివారం నాడు సంపూర్ణ లాక్డౌన్ విధించారు. నాగ్పూర్లో సంపూర్ణ లాక్డౌన్ కొనసాగుతోంది. భోపాల్, జబల్పూర్లల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. త్వరలో బెంగళూరులోనూ వారాంతపు రోజుల్లో లాక్డౌన్ విధించే అవకాశాలు లేకపోలేదు. గుజరాత్లోని అహ్మదాబాద్, రాజ్కోట్, వడోదర, సూరత్ వంటి నగరాల్లో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని సమాచారం.