మళ్లీ 60 వేలకు పైగా: రోజూ వేలల్లో: కరోనా కట్టుతప్పినట్టే: వ్యాక్సినేషన్లో అదే జోరు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ జెట్ స్పీడ్తో పరుగులు పెడుతోంది వాటి సంఖ్య. అనేక రాష్ట్రాల్లో కరోనా తీవ్రత కనిపిస్తోంది. రోజు గడిచే సరికి వేలల్లో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, పోలింగ్ ప్రక్రియ కరోనా కేసుల పెరుగుదల కారణమౌతోన్నాయనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఇదివరకు 50 వేలకు లోపుగా నమోదైన కొత్త కేసులు ఒక్కసారిగా 60 వేల మార్క్ను దాటేయడం కలవరపరుస్తోంది.
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 62,714 కరోనా కేసులు నమోదయ్యాయి. 312 మంది మరణించారు. రోజువారీ కేసుల పెరుగుదలలోనూ, కరోనా మరణాల్లోనూ ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో కొత్త కేసులు వెలుగులోకి రాలేదు. వరుసగా రెండోరోజు కూడా 60 వేలకు పైగా కొత్త కేసులు రికార్డయ్యాయి. 28,739 మంది ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,19,71,624కు చేరుకుంది. ఇందులో 1,13,23,762 మంది డిశ్చార్జ్ కాగా.. 1,61,552 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 4,86,310కి చేరింది.
మరో వైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 6,02,69,782 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్గఢ్లల్లో విద్యాసంస్థలు మూతపడ్డాయి. తాజాగా ఈ జాబితాలో తెలంగాణ చేరింది. రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తాజాగా కరోనా ప్రొటోకాల్ను జారీ చేసింది.
పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలపై ఆంక్షలు విధించింది. అంత్యక్రియలను కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో జనం గుమికూడకూడదని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం శనివారమే కోవిడ్ ప్రొటోకాల్ను జారీ చేసిన విషయం తెలిసిందే. మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేసింది కేసీఆర్ సర్కార్. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోని పలు నగరాల్లో ఆదివారం నాడు సంపూర్ణ లాక్డౌన్ విధించారు. నాగ్పూర్లో సంపూర్ణ లాక్డౌన్ కొనసాగుతోంది. భోపాల్, జబల్పూర్లల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. త్వరలో బెంగళూరులోనూ వారాంతపు రోజుల్లో లాక్డౌన్ విధించే అవకాశాలు లేకపోలేదు.