ముగ్గురు ఉద్యోగులను చంపిన వార్తాపత్రిక ఎడిటర్
అగర్తాలా: త్రిపురలోని ఓ వార్తాపత్రిక యజమాని ముగ్గురు తన ఉద్యోగులను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. తన డ్రైవర్ను, ప్రూఫ్ రీడర్ను, మేనేజర్ను నిరుడు అతను చంపినట్లు అభియోగాలు మోపారు. ఈ కేసులో అతన్ని కోర్టు దోషిగా తేల్చింది.
ప్రాంతీయ దినపత్రిక గాందూత్కు సుశీల్ చౌధురి (76) సంపాదకుడిగా, యజమానిగా వ్యవహరిస్తున్నాడు. ఈ కేసులో దోషిగా నిర్ధారించిన ఆగర్తాలా కోర్టు అతనికి విధించే శిక్షను గురువారంనాడు ఖరారు చేయనుంది.
చౌధురి అక్రమ భూలావాదేవీల్లో చిక్కుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని బయటపెడతానని అతని మేనేజర్ రంజిత్ చౌధురి (61) బెదిరించినట్లు సమాచారం. దాంతో తన డ్రైవర్ బలరాం ఘోష్ సహకారంతో సుశీల్ చౌధురి రంజీత్ను హత్య చేశాడు.

మేనేజర్ హత్యను కళ్లారా చూసిన ప్రూఫ్ రీడర్ సుజిత్ భట్టాచార్జీ (25)ని బలరామ్ ఘోష్ హత్య చేశాడు. తన మరణించడానికి ముందు సుజీత్ బలరాంను పొడిచాడు. దీంతో బలరామ్ మరణించాడు.
ఆ ముగ్గురి శవాలు కూడా సుశీల్ చౌధురి కార్యాలయంలో కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఆ ముగ్గురినీ చంపారని, నిజానికి వారు తనను చంపాలని వచ్చారని సుశీల్ చౌధురి ఓ కట్టుకథ అల్లాడు. హంతకుల ఆచూకీ చెప్తే లక్ష రూపాయలు ఇస్తానని కూడా ప్రకటించాడు. డ్రైవర్ భార్య నియతి ఘోష్ సహకారంతో అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఆమె సాక్షి.












Click it and Unblock the Notifications