వచ్చే వారం రోజులు చాలా కీలకం, భవిష్యత్ బాగుండాలంటే తప్పదు: వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వచ్చే వారం రోజులు అత్యంత కీలక మని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఈ వ్యవధిలో కరోనా తీవ్రతను బట్టి లాక్ డౌన్ ను మరికొన్ని రోజులు పొడిగించాలా? లేదా? అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.

కరోనాను అంతం చేసేందుకు..
ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 24న మూడు వారాలపాటు లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత మొదటి రెండు వారాలు ప్రజలంతా బలమైన సంకల్పంతో కరోనాపై పోరాటం చేశారని, ఐక్యతను చాటారని ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మూడోవారంలోకి చేరుకున్నామని, ఏప్రిల్ 14 తర్వాత ప్రధాని మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని, కరోనాను అంతం చేసేందుకు కలిసి పోరాటం చేయాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

ఏం పోయినా తెచ్చుకోవచ్చు కానీ..
బలమైన నాయకత్వం వల్లే ప్రజలంతా ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడుతున్నారని అన్నారు. ఆర్థికంగా దేశానికి నష్టం వాటిల్లినప్పటికీ తిరిగి గాడిలో పెట్టవచ్చని, అదే మనుషుల ప్రాణాలు పోతే మాత్రం తిరిగి తీసుకురాలేమని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యల కారణంగా కరోనావైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకోగలుగుతున్నామని చెప్పారు.

భవిష్యత్ బాగుండాలంటే..
సామాజిక దూరం పాటించకపోతే ఎంతటి విపత్తు ఏర్పడుతుందో తబ్లీఘీ జమాత్ కార్యక్రమం ద్వారా స్పష్టమైందని వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఖచ్చితంగా భారతదేశం కరోనాపై విజయం సాధించితీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా కలకాలం హాయిగా జీవించాలంటే ఇంకొన్ని రోజులు ఇబ్బందులు భరించాలని ప్రజలకు ఉపరాస్ట్రపతి పిలుపునిచ్చారు. ఈ కష్టకాలంలో దేశ ప్రజల ఆకలి తీరుస్తున్న రైతులకు మనమంతా రుణపడి ఉండాలని అన్నారు.












Click it and Unblock the Notifications