తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు: మూడ్రోజులపాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు, ఎల్లో అలర్ట్
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎండవేడిమి, ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. ఎందుకంటే.. నేటి నుంచి మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో మూడురోజులపాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఎల్లో అలర్ట్ జారీ
పశ్చిమ మరట్వాడా మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాట వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలో ఏప్రిల్ 18 వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఏపీలోనూ మూడురోజులపాటు పలు చోట్ల వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్-యానంలో దిగువ ట్రోపోఆవరణములో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని.. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో.. శుక్ర, శని, ఆదివారాల్లో తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉండగా.. శని, ఆదివారాల్లో ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు పడతాయని పేర్కొంది.
దక్షిణ కోస్తా, రాయలసీమలోనూ మోస్తరు వర్షాలు
ఇక, దక్షిణ కోస్తాంధ్రలో శుక్రవారం వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. శని, ఆదివారాల్లో తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉండగా.. రాయలసీమలో శుక్రవారం తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది శని, ఆదివారాల్లో తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని.. ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాలు చేతికొచ్చే సమయంలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.