పుల్వామా ఉగ్రదాడి: rdx ఎక్కడిది? ఏడాది గడిచినా దొరకని ఆధారాలు.. తాజాగా ఎన్ఐఏ సోదాలు
దేశ చరిత్రలోనే అత్యంత హేయమైన ఉగ్రదాడిగా రికార్డులకెక్కిన 'పుల్వామా దాడి' కేసు ఇంకా కొలిక్కి రాలేదు. జమ్మూ-శ్రీనగర్ హైవేపై పట్టపగలు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి జరిపి 44 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న ఘాతుకానికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కి ఇప్పటిదాకా ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఘటన జరిగి ఏడాది పూర్తయినా చార్జి షీటు నమోదు కాలేదు. జమ్మూకాశ్మీర్ డీఎస్పీ దవిందర్ సింగ్ అరెస్టు తర్వాత ప్రతిపక్ష పార్టీలన్నీ అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎన్ఐఏ మళ్లీ సోదాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది.
పుల్వామా ఉగ్రదాడి కేసుకు సంబంధించి ఎన్ఐఏ బృందాలు బుధవారం కాశ్మీర్ లోయలో పలు చోట్ల దాడులు, సోదాలు నిర్వహించారు. పుల్వామా జిల్లాలోని కోకాపోరాకు చెందిన జైషే సానుభూతిపరుడు జాహిద్ షేక్ ఇంట్లో అధికారులు తనిఖీ చేశారు. పుల్వామా దాడికి జాహిద్ నిధులు సమకూర్చిఉంటాడని ఎన్ఐఏ భావిస్తోంది. కాకాపోరాతోపాటు కస్బాయర్ తదితర గ్రామాల్లోనూ పలువురు యువకుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. చడీచప్పుడు లేకుండా ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారని, దీనిపై స్థానిక పోలీసులకు కూడా సమాచారం లేదని తెలుస్తోంది. ఈ కేసు ఇంత జఠిలంగా మారడానికి కారణాలేవంటే..
గతేడాది ఫిబ్రవరి 14న ఆదిల్ అహ్మద్ దార్ అనే జైషే ఉగ్రవాది.. కారు నిండా ఆర్డీఎక్స్, ఇతర పేలుడు పదార్థాలను నింపుకొని.. జమ్మూ-శ్రీనగర్ రహదారిపై కాన్వాయ్ గా వెళుతోన్న సీఆర్పీఎఫ్ వాహనాన్ని ఢీకొట్టడంద్వారా ఆత్మాహుతికి పాల్పడ్డాడు. పేలుడుకు 25కేజీల ఆర్డీఎక్స్ ఉపయోగించడంతో ఉగ్రవాదితోపాటు అతను వాడిన కారు కూడా తునాతునకలైపోయింది. దాడికి పాల్పడింది తామేనంటూ జైషే వీడియో విడుదల చేయకుంటే.. కారు నడిపింది అహ్మద్ దారే అని కనిపెట్టడం కూడా కష్టమయ్యేది. కారు శిధిలాలపై నెత్తుటి మరకల్ని.. దార్ తల్లిదండ్రుల డీఎన్ఏతో పోల్చిన తర్వాతే అధికారులు నిర్ధారణకు వచ్చాయి. అయితే పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయనేదానిపై..
చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)కింద కేసు నమోదుచేసుకున్న ఎన్ఐఏ.. ఏడాది కాలంగా పుల్వామా దాడిపై దర్యాప్తు చేస్తున్నా ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఎందుకంటే పుల్వామా దాడి కేసులో నిందితులుతంతా తర్వాతి కాలంలో వివిధ ఎన్ కౌంటర్లలో చనిపోయారు. ఆర్డీఎక్స్ అమర్చిన కారు ఇంజన్ తునాతునకలై పక్కనున్న నదిలోకి ఎగిరిపడ్డాయని, దీంతో పేలుడు పదార్థం ఆనవాళ్లను కనిపెట్టడం కష్టమైందని ఫోరెన్సిక్ అధికారులు పేర్కొన్నారు. తాజాగా మొదలైన సోదాలతోనైనా పుల్వామా ఉగ్రదాడి కేసు ఓ కొలిక్కి వస్తుందో లేదో వేచిచూడాలి.