పూరీతో రూ.60 కోట్ల సినిమా: దేవేగౌడకు సొంత ఎమ్మెల్యేల నిరసన
బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమార స్వామికి పెద్ద తలనొప్పి వచ్చి పడింది. తన కుమారుడు నిఖిల్ గౌడను కన్నడ సినీ రంగానికి పరిచయం చెయ్యాలని భావించిన కుమార స్వామి, ఇప్పడు సొంత పార్టిలో శాసన సభ్యులే నిరసన వ్యక్తం చేస్తుండటంతో వారికి ఏం చెప్పాలో తెలియక తర్జన భర్జన పడుతున్నారు.
రేస్ కోర్స్ రోడ్డులో కొన్ని సంవత్సరాల పాటు జేడీఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉంది. కొద్ది కాలం తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు ఈ భవనం తమదంటే తమదని కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు తీర్పుతో జేడీఎస్ కార్యాలయం ఖాళీ చేశారు. మూడు రోజుల క్రితం అక్కడ కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభమైంది.
జేడీఎస్ నాయకులు శేషాధ్రిపురంలో కొత్త కార్యాలయం నిర్మిస్తున్నారు. ఈ కార్యాలయం నిర్మాణానికి తన దగ్గర, తమ కుటుంబ సభ్యుల దగ్గర డబ్బులు లేవని, పార్టీ శాసన సభ్యులు, మాజీ మంత్రులు, కార్యకర్తలు నిధులు సమకూర్చాలని మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పారు.
అదే సమయంలో తెలుగు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూ. 60 కోట్లు ఖర్చు పెట్టి నిఖిల్ గౌడను సిల్వర్ స్క్రీన్కు పరిచయం చెయ్యడానికి దేవేగౌడ కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. దీంతో, కొడుకును హీరోగా పెట్టి సినిమా తీసేందుకు డబ్పులున్నాయి కానీ, కార్యాలయం కోసం డబ్బులు లేవా అని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాకు ఖర్చు చేసే రూ.60 కోట్లలో కొంత మొత్తాన్ని పార్టీ కార్యాలయం నిర్మాణానికి ఇస్తే తాము సంతోషంగా జోలపట్టి నిధులు వసూలు చేస్తామని ఎమ్మెల్యేలు అంటున్నారు. దేవేగౌడ ప్రధాని అయ్యారని, ఆయన కుమారుడు సీఎం అయ్యారని, పార్టీలో వారి కుటుంబ సభ్యులు అనేక పదవులు అనుభవించారని గుర్తు చేస్తున్నారు.
పార్టీకి శాశ్వత భవనం నిర్మించేందుకు డబ్బులు లేవనడం ఎంత వరకు సమంజసమని అడుగుతున్నారు. మరోవైపు రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నారని మండిపడుతున్నారు. వారు కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తుంటే తాము మాత్రం కార్యాలయ నిర్మాణం కోసం నిధులు ఇవ్వాలని ఎలా అడుగుతామంటున్నారు.