Nirbhaya Case: వినయ్ శర్మ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషి వినయ్ శర్మ పెట్టుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం తోసిపుచ్చింది. తన క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ వినయ్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం వినయ్ శర్మ పెట్టుకున్న పిటిషన్ను తోసిపుచ్చింది. వినయ్ శర్మ తన మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదంటూ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పిటిషన్ను రాష్ట్రపతి తిరస్కరించిన నేపథ్యంలో వినయ్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
వినయ్ శర్మ మానసికంగా అనారోగ్యంగా ఉన్నాడన్న వాదనను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఆయన మెడికల్ రిపోర్టులను బట్టి అతడు ఆరోగ్యంగానే ఉన్నాడని ధర్మాసనం పేర్కొంది. క్షమాభిక్ష తిరస్కరణపై న్యాయసమీక్ష కోరేందుకు ఎలాంటి ఆధారాల్లేవంటూ పిటిషన్ను కొట్టివేసింది.
Nirbhaya case: కోర్టులో కన్నీటిపర్యంతమైన నిర్భయ తల్లి, న్యాయమూర్తి ఏం చెప్పారంటే..?
ఉరిశిక్ష అమలును జాప్యం చేసేందుకు నిర్భయ కేసులో దోషులైన వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, ముకేష్ సింగ్లు కోర్టులను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. తమకున్న న్యాయ అవకాశాలను వినియోగించుకుంటామంటూ ఇప్పటికే ఖరారైన ఉరిశిక్షలను కూడా వాయిదా వేయించేలా చేసిన విషయం తెలిసిందే.
తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలును ఆపాలంటూ ఇప్పటికే ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీ హైకోర్టు నిర్భయ దోషులకు న్యాయ అవకాశాలను వినియోగించుకునేందుకు వారం రోజుల గడువు ఇచ్చింది.
దోషులను వేర్వేరుగా శిక్షించేందుకు అనుమతివ్వాలని కేంద్రం న్యాయస్థానాలను కోరగా.. అలా కుదరదని స్పష్టం చేశాయి. దోషులను వెంటనే ఉరితీయాలంటూ నిర్భయ తల్లి ఆశాదేవి కూడా కోర్టులను అభ్యర్థించారు. బుధవారం కోర్టులో కన్నీటిపర్యంతమయ్యారు. దోషులను శిక్షించాలంటూ రెండు చేతులతో న్యాయమూర్తులకు దండంపెట్టారు. వ్యవస్థపై తమకు నమ్మకం పోతోందని అన్నారు. ఉరిశిక్ష అమలును ఆలస్యం చేసేందుకు దోషులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, న్యాయస్థానం వీటిని ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ప్రశ్నించారు.