నిర్భయ కేసు: క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్: మిగితా వారిని ఉరితీయొచ్చన్న కేంద్రం
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులను శనివారం(ఫిబ్రవరి 1న) ఉరితీయనున్నారు. అయితే, ఒక్క రోజు ముందు నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా తనకు క్షమాభిక్ష పెట్టాలంటూ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

తాను జువైనల్ అంటూ పవన్ గుప్తా..
నిర్భయ ఘటన సమయంలో తాను మైనర్ అని వేసిన పిటిషన్ను కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. నిర్భయ హత్యాచార ఘటన సమయంలో తాను మైనర్ అని, దాని ఆధారంగానే విచారణ జరపాలని కోరుతూ పవన్ గుప్తా ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈ పిటిషన్ను సుప్రీం తిరస్కరించింది. దీంతో తీర్పును పున:సమీక్షించాలని కోరుతూ శుక్రవారం పవన్ గుప్తా రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని కోరాడు.

శనివారం దోషులకు ఉరితీయాల్సి ఉండగా..
కాగా, ఢిల్లీ కోర్టు ఇచ్చిన డెత్ వారెంట్ ప్రకారం శనివారం ఉదయం 6గంటలకు దోషులను ఉరితీయాల్సి ఉంది. అయితే, ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ దోషులు వేసిన పిటిషన్పై ఢిల్లీ పాటియాల కోర్టు శుక్రవారం ప్రారంభించింది. దోషులందరూ అన్ని న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకునేవరకు ఉరిశిక్ష అమలు చేయవద్దని కోరుతూ ఢిల్లీ కోర్టులో గురువారం పిటిషన్ దాఖలైంది.

తీహార్ జైలు అధికారులకు నోటిసులు
ఈ పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం.. వీటిపై తమ స్పందన తెలియజేయాల్సిందిగా తీహార్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. అయితే, శిక్షను ఆలస్యం చేసేందుకే దోషులు ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారని, చట్టాన్ని అవహేళన చేస్తున్నారని ప్రాసిక్యూషన్ న్యాయవాదులు తమ వాదనను వినిపిస్తున్నారు.

మిగిలిన వారిని ఉరితీయొచ్చన్న కేంద్రం
కాగా, నిర్భయ దోషి వినయ్ కుమార్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది. అతడ్ని మినహా మిగిలిన ముగ్గురిని శనివారం ఉరితీయొచ్చని కేంద్రం స్పష్టం చేసింది. నలుగురినీ ఒకేసారి ఉరితీయాలన్న నిబంధనేమీ లేదని తెలిపింది. కాగా, ఇప్పటికే ముకేష్ సింగ్ పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. 2012లో దేశ రాజధానిలో నిర్భయపై ఆరుగురు సామూహిక అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితుల్లో ఒకడు జైలులోనే ఆత్మహత్య చేసుకోగా.. మరో నిందితుడు జువైనల్ కావడంతో జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. నలుగురు దోషుల్లో ఇప్పటికే దాదాపు అందరూ క్షమాభిక్ష కోసం ప్రయత్నించారు. వారి క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరించబడినా.. మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications