ఏడేళ్లు గడిచింది, ఇంకెప్పుడు : నిర్భయ దోషులకు అమలుకానీ శిక్ష, ఓటేయమంటోన్న పేరెంట్స్
న్యూఢిల్లీ : ఎన్నికల వేళ దేశ రాజధాని నేతల ప్రచారం, పార్టీల నినాదాలతో హోరెత్తుతుంటే .. నిర్భయ పేరెంట్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఓటేయకూడదని డిసిషన్ తీసుకున్నట్టు ఆశాదేవి, బద్రీనాధ్ సింగ్ దంపతులు మీడియాకు వెల్లడించారు. తమ కూతురిపై లైంగికదాడి చేసిన నిందితులకు విధించిన శిక్ష అమలు చేయడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని .. అందుకే ఓటేయకూడదనే భావిస్తున్నట్టు వారు స్పష్టంచేశారు.
జిమ్మిక్కులే ..
నిర్భయపై జరిగిన దారుణ ఘటనపై రాజకీయ నేతలు మొసలి కన్నీరు కార్చారని ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు. ఇది వారి జిమ్మిక్కులో భాగమేనని విమర్శించారు. నిర్భయపై లైంగికదాడి చేసిన నిందితులు ఇంకా సజీవంగానే ఉన్నారని .. వారికి శిక్ష ఎప్పుడు ఖరారు చేస్తారని ప్రశ్నించారు. ఢిల్లీలోని విధులు మహిళలు, చిన్నారులకు ఇంకా సురక్షితం కాదని .. జరుగుతోన్న ఘటనలు అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అంతేకాదు మహిళల రక్షణ కోసం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
సీసీ కెమెరాలేవీ ?
కూడళ్లలో కనీసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని చెప్పారు. దేశంలో ఇప్పటికీ యువతులకు సరైన రక్షణ లేకపోవడంతో .. వారి తల్లిదండ్రులు ఆందోళన చెప్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలకు విశ్వాసం పోయిందన్నారు. అందుకే ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టంచేశారు. తమ కూతురిపై దారుణమైన లైంగికదాడి జరిగి నేటికి ఏడేళ్లవుతోంది. కానీ నిందితులకు విధించిన ఉరిశిక్షను ఇప్పటికీ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థలో ఏమీ మారలేదు, అందుకే ఈ సారి ఓటుు వేయొద్దనే నిర్ణయానికి వచ్చామని ఆశాదేవి దంపతులు స్పష్టంచేశారు.
మాటలే .. చేతలేవీ ...?
అన్నీ పార్టీలు మహిళ భద్రత, ఉపాధి గురించి మాట్లాడతారు. కానీ అందుకు అనుసరించాల్సిన రోడ్ మ్యాప్ అమలు చేయడంలో మాత్రం విఫలమవుతారని నిర్భయ తండ్రి సింగ్ పేర్కొన్నారు. వివిధ పార్టీ నేతలు తమ సొంత ఆలోచనలను ప్రజలపై రుద్దుతారని ... కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మాత్రం కోల్డ్ స్టోరేజ్ లో పెడతారని విమర్శించారు. 2013లో నిర్భయ నిధి ఏర్పాటు చేస్తామని, సంక్షేమ నిధికి నిధులు కేటాయిస్తామని హామీలు ఇచ్చారు. కానీ అవి క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో విఫలమయ్యారని ఫైరయ్యారు.
ఇంకా జైళ్లోనే ... శిక్ష ఎప్పుడో
2013 డిసెంబర్ 16న ఢిల్లీలో అర్ధరాత్రి నిర్భయ ఆమె స్నేహితుడు బస్సులో వెళ్తుండగా ఆరుగురు మృగాళ్లు లైంగికదాడి చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఒకడు జువైనల్ హోంలో ఉండగా .. మిగతా ఐదుగురికి ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఇందులో ఒకడు జైలులో ఆత్మహత్య చేసుకోగా .. నలుగురికి ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ శిక్షపై దోషులు అప్పీల్ చేసుకోవడంతో శిక్ష అమలు జాప్యమవుతోంది.