టిపై వెంకయ్య, 'ప్రధాని'పై పెళ్లిరోజు గుర్తు చేసుకున్నవైనం
బెంగళూరు/న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన కాంగ్రెసు పార్టీ సొంత వ్యవహారం కాదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు శనివారం బెంగళూరులో అన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పుకునేందుకు సిగ్గుపడుతోందని, ఈ విషయంలో తనకు పెళ్లి నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు. నవ దంపతులు గుమ్మం ముందు నిలబెట్టి ఒకరి పేర్లు ఒకరు చెప్పాలని బంధువులు అడిగితే, తాను వెంటనే తన సతీమణి పేరు చెప్పినా, ఆమె మాత్రం తన పేరు చెప్పలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో తిరస్కరించిన ముసాయిదా బిల్లు పైన చర్చ లేకుండానే లోకసభలో ప్రవేస పెట్టడానికి కాంగ్రెసు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని, కాంగ్రెసు వైఫల్యంతోనే రాష్ట్ర విభజన కోరుతూ, వ్యతిరేకిస్తూ పలువురు మృతి చెందారని ఆరోపించారు. ఢిల్లీలో దీక్షలు చేస్తున్న నాయకులు, పార్లమెంటు సమావేశాలు జరగకుండా చేస్తున్నదెవరో కాంగ్రెసు చెప్పాలన్నారు. సీమాంధ్రుల భయాందోళనలు పోగొట్టే దిశలో బిజెపి కార్యక్రమాలను రూపొందించుకుంటుందన్నారు.

విభజనలో ఇరుప్రాంతాలకూ సమన్యాయం జరగాలన్నదే తమ విధాన నిర్ణయమని బిజెపి అధికార ప్రతినిధి నిర్మలా ఢిల్లీలో అన్నారు. తాము మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు ఏ ఒక్క ప్రాంతానికీ అన్యాయం జరక్కుండా, ఎక్కడా ఎలాంటి వివాదానికి తావు లేకుండా విభజన చేశామన్నారు. తెలంగాణ ఏర్పాటు చేయాలని 1997 నుంచే తాము కోరుతున్నామని, యూపీఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లు తెస్తే మద్దతు ఇస్తామని కూడా తాము స్పష్టం చేశామని ఆమె గుర్తు చేశారు.
ఇప్పటికీ తాము అదే మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. అయితే, విభజనతో ఏ ఒక్క ప్రాంతానికీ అన్యాయం జరగకూడదని, ఈమేరకు విభజనపై సమగ్రమైన ప్రణాళిక ఉండాలని తాము పార్లమెంటులో చెబుతామన్నారు. పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బిల్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తిరస్కరించిన బిల్లేనా? దానికి కేంద్రం ఏమైనా సవరణలు జత చేసిందా? అన్నది తాము ఇంకా పరిశీలించలేదన్నారు.
ఆ బిల్లు తమకు చేరిన తర్వాత పరిశీలించి, తమ పార్టీ తరఫున ఎలాంటి సవరణలు చేయాలో అప్పుడు ఆలోచిస్తామన్నారు. బిల్లులో కేంద్రం చేసిన సవరణలు ఏంటో తమకు తెలియదు కాబట్టి, అధికారికంగా బిల్లు తమకు అందినప్పుడే దానిపై దృష్టి సారిస్తామన్నారు. వెంకయ్య నాయుడుతో కాంగ్రెస్ నాయకులు జరుపుతున్న చర్చలను ప్రస్తావించగా కాంగ్రెస్ నాయకులు తొలుత వారి ముఖ్యమంత్రితో రాయబారం చేసుకోవాలని హితవు పలికారు.












Click it and Unblock the Notifications