అన్నపూర్ణ స్టూడియోలో నీతా, 'మనం' చూపించిన నాగ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోను కార్పొరేట్ రంగ ప్రముఖులు నీతా అంబానీ, స్వాతి పిరమాల్, నవాజ్ సింఘానియా, అనన్య గోయెంకా, లీనా తివారీ, అనుప షెహ్నాయ్, రాధిక సేథ్, సినీ నటి జుహీ చావ్లా తదితరులు సందర్శించారు.
నాగార్జున వీరికి స్వాగతం పలికారు. అనంతరం వారికి స్టూడియోలోని పలు విభాగాలను దగ్గరుండి చూపించారు. ఈ సందర్భంగా వారి కోసం అక్కినేని కుటుంబ సభ్యులు కలిసి నటించిన, నాగేశ్వర రావు చివరి చిత్రం మనం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. శనివారం వీరు అన్నపూర్ణ స్టూడియోను సందర్శించారు. హీరో మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రద శిరోద్కర్ కూడా ఉన్నారు.
కాగా, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును నీతా అంబానీ సహా పలువురు ప్రముఖులు కలిసి చెక్కులు అందజేసిన విషయం తెలిసిందే.
ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్తలు నీతా అంబానీ, పింకీ రెడ్డితో పాటు బాలీవుడ్ నటి జూహీ చావ్లా శనివారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. చంద్రబాబును ఆయన నివాసంలో కలసిన నీతా అంబానీ 11 కోట్ల 11 లక్షల 11వేల 111 రూపాయల చెక్కును చంద్రబాబుకు అందజేశారు.
ఈ నగదు మొత్తాన్ని హుదూద్ తుపాన్తో అతలాకుతలమైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పునర్నిర్ణానికి వినియోగించాలని వారు చంద్రబాబును కోరారు. హుధుద్ తుఫాన్తో నష్టపోయిన విశాఖపట్నంలో జరుగుతున్న సహాయక చర్యలను వారు చంద్రబాబుని అడిగి తెలుసుకున్నారు.