ఆయనకు దేశం ఎంతో రుణపడి ఉంది: నితిన్ గడ్కరీ
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు భారతదేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. మన్మోహన్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ దేశంలోని పేదవర్గాలకు లబ్ధి చేకూర్చే ఉదారవాద ఆర్థిక విధానాలను తీసుకురావల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ఆర్థికశాఖ మంత్రిగా మన్మోహన్ 1991లో చేపట్టిన సంస్కరణలు భారత్ కొత్త మార్గంలో పయనించడానికి అవసరమైన దారిని చూపించాయని కొనియాడారు. అప్పుడు తాను మహారాష్ట్రలో మంత్రిగా ఉన్నానన్నారు. ఆర్థిక సంస్కరణల వల్లే రోడ్ల నిర్మాణానికి భారీగా నిధుల్ని సమీకరించగలిగామన్నారు. రైతులు, పేదల కోసం మరిన్ని ఉదారవాద సంస్కరణల్ని తీసుకురావాల్సి ఉందన్నారు. దేశ అభివృద్ధికి ఆర్థిక సంస్కరణలు ఎలా కారణమవుతాయనేదానికి చైనాయే ఉదాహరణ అని గడ్కరీ అన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందడానికి మూలధన వ్యయం అవసరమవుతుందన్నారు.

రోడ్లు, రహదారుల నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సామాన్య ప్రజల నుంచి కూడా నిధులను సమీకరిస్తోందని గడ్కరీ వెల్లడించారు. కేంద్ర రోడ్డు, రహదారుల శాఖ 26 కొత్త ఎక్స్ప్రెస్వేలను నిర్మిస్తోందని, అందుకు అవసరమైన నిధులకు ఎలాంటి కొరత లేదని తెలిపారు. రోజుకు 60 కి.మీ రహదారులను నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఎన్హెచ్ఏఐకి టోల్ రెవెన్యూ సంవత్సరానికి రూ.40వేల కోట్లు వస్తున్నాయని, 2024 కల్లా రూ.1.40 లక్షల కోట్లకు చేరాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు.












Click it and Unblock the Notifications