లాక్ డౌన్ వేళ గడ్కరీ ఆదాయం ఎంతో తెలుసా : యూట్యూబ్ పాఠాలతో లక్షల సంపాదన..!!
కరోనా..సుదీర్ఘ కాలం లాక్ డౌన్ కారణంగా అనేక మంది..కీలక పరిశ్రమలు ఆర్దికంగా నష్టాలు చవి చూశాయి. కానీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాత్రం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దీని ద్వారా ఆదాయం సమకూర్చుకున్నారు. ఇప్పటికీ ఆ సమయంలో చేసిన పనుల ద్వారా ఆదాయం వస్తూనే ఉంది. ఈ విషయాలను స్వయంగా కేంద్రమంత్రి షేర్ చేసుకున్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లాక్డౌన్ సమయంలో ఇచ్చిన లెక్చర్స్ ఇప్పుడు ఆయనకు లక్షలు సంపాదించి పెడుతున్నాయి.
కరోనా వేళ తన ఆదాయం పెరిగిందని ఇవాళ ఆయన చెప్పారు. యూట్యూబ్లో తాను పోస్ట్ చేసిన లెక్చర్ వీడియోల వ్యూయర్షిప్ ఈ కరోనా కాలంలో బాగా పెరిగిందని, అందువల్ల తనకు రాయల్టీ రూపంలో నెలకు దాదాపు రూ.4 లక్షలు వస్తున్నాయని గడ్కరీ తెలిపారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పురోగతిపై భరూచ్లో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. రోడ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్, కన్సల్టెంట్లకు రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ రేటింగ్ ఇవ్వడం ప్రారంభమైందన్నారు గడ్కరీ.
కొవిడ్ సమయంలో తాను రెండు పనులు చేశానని చెప్పారు. చెఫ్గా మారి ఇంట్లో వంట చేశానని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపన్యాసాలు ఇచ్చానని తెలిపారు. ఆన్లైన్లో 950కి పైగా లెక్చర్లు ఇచ్చానన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాల విద్యార్థులకు కూడా లెక్చర్లు ఇచ్చానని చెప్పారు. వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేశానని, వాటికి వ్యూయర్షిప్ పెరుగడంతో యూట్యూబ్ ఇప్పుడు నెలకు రూ.4 లక్షలు రాయల్టీగా చెల్లిస్తోందన్నారు.
ఇప్పుడు ఈ అంశాన్ని స్వయంగా ఆయనే చెప్పటంతో తెలుసుకున్న వారంతా ఆయన వీడియోలను యూ ట్యూబ్ లో ఇప్పుడు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మంత్రి చెప్పిన అంశాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. అయితే, లాక్ డౌన్ సమయంలోనూ మంత్రి యూ ట్యూబ్ పాఠాలతో పెద్ద మొత్తంలో ఆదాయం తెచ్చుకోగలిగారు.