మహా కూటమి పాలిటిక్స్: అరారియా ఉప ఎన్నిక నితీశ్ ప్రతిష్ఠకు సవాల్.. తేజస్వి భవితవ్యానికి పరీక్ష
పాట్నా: బీహార్లో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహా కూటమి నుంచి సీఎం నితీశ్కుమార్ వైదొలిగి బీజేపీతో జత కట్టిన తర్వాత అరారియా లోక్సభ, భాబూయా, జెహానాబాద్ అసెంబ్లీ స్థానాలకు ఆదివారం పోలింగ్ జరుగనున్నది. బుధవారం ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. దీనికితోడు పశుగ్రాసం కేసులో మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ జైలుపాలైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాజకీయంగా కాకలు తీరిన యోదుడు.. జనతా ఉద్యమ సమయంలో లాలూకు సహచరుడు ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్తో లాలూ తనయుడు మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఆర్డేడీ తరఫున సారథ్యం వహిస్తున్నారు. 2015లో జరిగిన ఎన్నికల్లో కలిసి పోటీ చేసి బీజేపీతో జత కట్టాలని నితీశ్ కుమార్ తీసుకున్న నిర్ణయానికి ఈ ఉప ఎన్నికల ఫలితాలు గీటు రాయి కానున్నాయి.

లాలూపై బీహార్ సీఎం ఇలా వాగ్భాణాలు
శుక్రవారంతో ముగిసిన ఎన్నికల ప్రచారంలోనూ నితీశ్ కుమార్.. బీజేపీతో జత కట్టడాన్ని సమర్థించుకున్నారు. బీహారీల ప్రయోజనాల కోసమే బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో చేరానని చెప్పుకొచ్చారు. కొందరు డబ్బు కోసం అర్రులు చాస్తుంటారని, ఒకరు చేసిన తప్పులకు మూల్యం చెల్లించక తప్పదని ఆర్జేడీ లాలూపై ఎదురు దాడికి దిగారు. అరారియా లోక్సభ స్థానానికి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసిన సీఎం నితీశ్ కుమార్.. తన ప్రభుత్వ పనితీరుకు నిలువుటద్దం అని నిలుస్తుందన్నారు.

అరారియాలో ముస్లింల ప్రాబల్యం ఎక్కువ
రాజకీయ దురుద్దేశంతోనే తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి కేసులో జైలు పాల్జేయడం వెనుక లోతైన కుట్ర దాగి ఉన్నదని ఆర్జేడీ నాయకుడు, లాలూ తనయుడు తేజస్వి యాదవ్ ఆరోపించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో అరారియా స్థానం నుంచి ఆర్జేడీ అభ్యర్థి మహ్మద్ తస్లిముద్దీన్ గెలుపొందారు. కానీ గతేడాది మరణించారు. 2009 ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి ప్రదీప్ సింగ్.. గత ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆర్జేడీ అభ్యర్థిగా తస్లీముద్దిన్ తనయుడు సర్ఫరాజ్ ఆలం బరిలో నిలిచారు. సీమాంచల్ ప్రాంతంలోని అరారియా లోక్ సభాస్థానం పరిధిలో ముస్లింల ప్రాబల్యం ఎక్కువ.

అరారియాలో మోదీ ప్రభంజనం నిల్
2014 ఎన్నికల్లో దేశమంతా ప్రధాని మోదీ హవా కనిపించినా అరారియా స్థానం పరిధిలో వ్యతిరేక పవనాలు వీచాయి. ఫలితంగా తస్లీముద్దీన్ విజయం సాధించగలిగారు. ఈ నేపథ్యంలో అరారియా లోక్సభ స్థానంలో తస్లీముద్దీన్ కుటుంబ పలుకుబడిని ఢీ కొట్టేందుకు నితీశ్ కుమార్ ప్రభావం ఏ మేరకు ఉపకరిస్తుందన్నది వేచి చూడాల్సిందే. ఇక తస్లీముద్దీన్ తనయుడు సర్ఫరాజ్ ఆలంకు ముస్లిం, యాదవుల ఓట్లు దన్నుగా ఉన్నాయి. అరారియా లోక్ సభ నియోజకవర్గ పరిదిలో సగానికి పైగా వారే. దీనికి తోడు ఆర్జేడీ.. ఎస్సీలు, ఈబీసీ ఓటర్లపై కన్నేసింది.

2014లో ఆర్జేడీ అభ్యర్థిగా తస్లీముద్దీన్ ఘన విజయం ఇలా
తస్లీముద్దీన్ మాదిరిగా సర్ఫరాజ్ ఆలం ప్రజాదరణ గల నేత కాదు. దీనికి తోడు జనాధికార్ పార్టీ అధినేత పప్పు యాదవ్ తన పార్టీ తరఫున విక్టర్ యాదవ్ను బరిలో నిలుపడంతో యాదవుల ఓట్లు చీలే ముప్పు పొంచి ఉన్నదంటున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రదీప్ సింగ్కు 2.61 లక్షల ఓట్లు రాగా, జేడీయూ అభ్యర్థికి 2.22 లక్షల ఓట్లు వచ్చాయి. కానీ గెలుపొందిన తస్లీముద్దీన్కు 4.08 లక్షల ఓట్లు పోలయ్యాయి.

జేడీయూ - బీజేపీ కూటమిని ఆర్జేడీ అడ్డుకోలేదని డిప్యూటీ సీఎం ఇలా
2014 ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓటమి పాలయ్యామని డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ తన ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఒకవేళ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే 70 వేలకు పైగా ఓట్ల ఆధిక్యం లభిస్తుందని తెలిపారు. తమ రెండు పార్టీల ఓటింగ్ శాతాన్ని ఆర్జేడీ అధిగమించలేదని తేల్చేశారు.

అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న విజయ్ మండల్ అనుచర గణం
అయితే 2014లో పోటీ చేసిన విజయ్ మండల్ సరైన అభ్యర్థి అన్న అభిప్రాయం ఉంది. 2015లో బీజేపీలో చేరి సిక్తి అసెంబ్లీ సీటు నుంచి విజయ్ మండల్ గెలుపొందారు. కానీ ప్రస్తుత అరారియా లోక్ సభ ఉప ఎన్నికలో విజయ్ మండల్.. బీజేపీ అభ్యర్థితో కలిసి తిరుగుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆయన మద్దతు దారులు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.

మాజీ సీఎం జీతన్ రాం మాంఝీని రంగంలోకి తెచ్చిన ఆర్జేడీ
ఇక సుఖ్దేవ్ పాశ్వాన్ ఆర్జేడీలో చేరడం బీజేపీకి కొంత ఎదురు దెబ్బేనని విశ్లేషకులు తెలిపారు. దీనికి తోడు మాజీ సీఎం జీతన్ రాం మాంఝీని ఎన్నికల ప్రచారంలో నిలిపింది ఆర్జేడీ. ఎస్సీ రిషిదేవ్ ఓటర్లను గెలుచుకోవడమే లక్ష్యంగా ఆర్జేడీ ప్రయత్నాలు సాగిస్తోంది. అరారియా లోక్సభ స్థానం పరిధిలో 17 లక్షల మంది ఎస్సీ రిషిదేవ్ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు.

ప్రగతి నినాదంతోనే నితీశ్ ఎన్నికల ప్రచారం
అరారియా లోక్సభ నియోజకవర్గంలో ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీయే, ఆర్జేడీ మద్య చెరో మూడుగా చీలాయి. 41 శాతం ముస్లింలు, 10 శాతం మంది ఓటర్లు ఓటర్లుగా ఉన్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన ఎన్నికల ప్రచారంలో అభివ్రుద్ధి నినాదాన్నిచ్చారు. దీనికి పోటీగా జేడీయూ తిరుగుబాటు నేత శరద్ యాదవ్.. ఆర్జేడీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మోదీ, నితీశ్ కుమార్ కలిసి లాలూకు వ్యతిరేకంగా కుట్ర చేశారని శరద్ యాదవ్ ఆరోపించారు.

బీజేపీ ప్రదీప్ కుమార్ సింగ్ పరిస్థితి ఏం బాగాలేదని వ్యాఖ్య
తస్లీముద్దీన్ పైనా, ఆయన కుమారుడు సర్ఫరాజ్ మీద యాదవులు మండి పడుతున్నారు. తమకు తస్లీముద్దీన్ చేసిందేమీ లేదని చెప్తున్నా.. బీజేపీ ప్రదీప్ కుమార్ సింగ్ పరిస్థితి అంత స్ఫూర్తిదాయకంగా ఏమీ లేదన్నారు. మరోవైపు జేడీయూ మద్దతుదారులు మాత్రం లాలూ పరోక్షంలో తేజస్వి యాదవ్ రాజకీయ భవితవ్యానికి ఈ ఉప ఎన్నికలు పరీక్ష వంటివని అంటున్నారు.

జెహానాబాద్లో పాగా వేసేందుకు ఎన్డీయే తహతహా
ఇక భాబూయా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యే ఆనంద్ భూషణ్ పాండే మరణించడంతో ఆయన భార్య రింకీ రాణి పాండే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. భాబుయా నుంచి ఆర్జేడీ మిత్రపక్షం శంభు పటేల్ పోటీ చేస్తున్నారు. 2009లో ససారాం నుంచి ఎన్నికైన మాజీ లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ మద్దతు శంభు పటేల్కు పుష్కలంగా ఉంది. భారీగా ఉన్న దళితుల ఓట్లు కీలకం కానున్నాయి. జెహానాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆర్జేడీ నేత ముద్రికా ప్రసాద్ యాదవ్ ఎన్నికైనా అంతకుముందు జేడీయూ - బీజేపీ కలిసి గెలుచుకున్నాయి. తిరిగి జేడీయూ కూటమి మళ్లీ గెలుచుకోవాలని తహతహలాడుతోంది.












Click it and Unblock the Notifications