సీఎం ‘దెయ్యాలు’ వదిలారు, అందుకే భవనం ఖాళీ చేస్తున్నా: లాలూ తనయుడు తేజ్ వింత వాదన
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రసంగాలే వింతగా, ఆకట్టుకునేలా ఉంటాయనుకుంటే.. ఆయన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మాటలు మరింత వింతగా ఉంటున్నాయి. ఇందుకు ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన తేజ్ ప్రతాప్ యాదవ్.. అనంతరం ఆ భవనంలో దెయ్యాలు ఉన్నాయని, అందుకే తాను ఖాళీ చేశానని చెప్పుకొచ్చారు. అంతేగాక, వాటిని ముఖ్యమంత్రే పంపించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం, డిప్యూటీ సీఎంలే దెయ్యాలను పంపించారు
‘ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డిప్యూటీ, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీలు నన్ను భవనం ఖాళీ చేయించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అందుకే వాళ్లు అందులోకి దెయ్యాలను వదిలారు' అని తేజ్ వింత వాదన తెరపైకి తెచ్చారు. అవి తనను పరేషాన్ చేస్తున్నాయని తెలిపారు.
గతంలో మంత్రిగా భవనంలోకి..
కాగా, గతంలో నితీష్ హయాంలో తేజ్ ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తేజ్ ప్రతాప్ యాదవ్కు ఈ భవనం కేటాయించారు. దేశ్రత్న మార్గ్లో ఉన్న ఈ భవనానికి వాస్తు దోషం ఉదంటూ అప్పుడు మార్పులు కూడా చేయించారు తేజ్ ప్రతాప్. అయితే, గత కొంత కాలం క్రితం మహా కూటమితో విడిపోయాడం, బీజేపీతో కలిసి నితీష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే.
సెంటిమెంటుగా భవనాన్ని వదలని తేజ్
ఆ తర్వాత లాలూ ఇద్దరు కుమారులను మంత్రివర్గం నుంచి తొలగించారు. అనంతరం ఆ భవనాన్ని ఖాళీ చేయాలంటూ తేజ్ ప్రతాప్ యాదవ్కు నితీష్ ప్రభుత్వం నోటీసులు పంపింది. కానీ, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన తల్లి రబ్రీదేవి ఇదే భవనాన్ని ఉపయోగించడం, ఇది సెంటిమెంటుగా భావించి తేజ్ ఖాళీ చేయలేదు. ఆ తర్వాత ఆర్జేడీ నేతలు ప్రభుత్వ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు స్టే విధించింది.
తేజ్ జిమ్మిక్కులంటూ జేడీయూ
విచారణ పెండింగ్లో ఉండగానే, తాజాగా, ఆ భవనంలో దెయ్యాలు తిరుగుతున్నాయంటూ ఖాళీ చేశారు తేజ్ ప్రతాప్ యాదవ్. అయితే, ఇదంతా తేజ్ చేస్తున్న జిమ్మిక్కుగా జేడీయూ అభివర్ణించింది. అతని సోదరుడు తేజస్వి యాదవ్ ఈ మధ్య తరచూ మీడియాలో కనిపిస్తున్నాడు.. ఇప్పుడు మీడియాను తనవైపు మళ్లించుకోవడానికే ఈ దెయ్యాల నాటకాలు ఆడుతున్నారని తేజ్ ప్రతాప్ యాదవ్పై విమర్శలు గుప్పించారు.