190 సీట్లు మాకే: డిప్యూటీపై లాలూ ప్రసాద్ దాటవేత
పాట్నా: ఎన్నికల్లో జెడియూ కన్నా ఆర్జేడీకి ఎక్కువ స్థానాలు గెలిచినా నితీష్ కుమారే ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారు. లౌకిక మహాకూటమికి మూడింట రెండొంతుల మెజార్టీ ఖాయమన్నారు.
తమకు 190 సీట్లకు పైగా వస్తాయని, వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనార్టీలు, పేద ప్రజల్లో 90 శాతానికి పైగా తమకు ఓటేశారన్నారు. తొలి దశ నుంచి ప్రారంభమైన మా ఆధిక్యం తుది వరకు కొనసాగిందన్నారు. ఐదే దశలో ప్రజలు ఏకపక్షంగా మాకు ఓట్లేశారన్నారు.
బిజెపి కేవలం పది నుంచి 10 సీట్లు మాత్రమే గెలుస్తుందని జోస్యం చెప్పారు. లౌకిక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఉప ముఖ్యమంత్రి పదవిని ఆర్జేడీ డిమాండ్ చేస్తుందా? అని విలేకరులు ప్రశ్నిస్తే లాలూ నేరుగా సమాధానం చెప్పలేదు. దాటవేసే ప్రయత్నం చేశారు.
ఫలితాలు వచ్చాక అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. గోమాంసం, రిజర్వేషన్ల అంశాలను లేవనెత్తడం ద్వారా ఓటర్లను వర్గాలవారీగా విడదీయాలని బిజెపి ప్రయత్నించిందని, తనను మోడీ దెయ్యంతో పోల్చడాన్ని బీహార్ ప్రజలు తీవ్రంగా తీసుకున్నారన్నారు. బీహార్ ఫలితాల తర్వాత మోడీ, అమిత్ షా పతనం ఖాయమన్నారు.

మోడీ పని తీరుకు నిదర్శనం కాదు: అనంత్ కుమార్
బీహార్ ఎన్నికల ఫలితాలు ప్రధాని మోడీ పని తీరుకు నిదర్శనం కాదని కేంద్రమంత్రి అనంత్ కుమార్ అన్నారు. ఒకవేళ రెఫరెండం అనుకుంటే అది లాలూ ప్రసాద్, నితీష్ కుమార్ ఆటవిక రాజ్యానికే అన్నారు. ఎగ్జిట్ పోల్ సర్వేలు భిన్నంగా ఉంటాయని, 8వ తేదీ వరకు ఫలితాల కోసం వేచి చూస్తామన్నారు.
కాగా, ఎగ్జిట్ పోల్స్పోటీ హోరాహోరీగా ఉన్నాయి. బిహార్ ముఖ్యమంత్రి పీఠం వరుసగా మూడోసారి నితీశ్ కుమార్కే దక్కనుందని ఎన్నికల అనంతర సర్వేలు వెల్లడించాయి.
అటు లౌకిక మహాకూటమి, ఇటు ఎన్డీయే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బిహార్ ఎన్నికల్లో విజయం లౌకికమహాకూటమికే లభించే అవకాశం ఉందని పలు సర్వేలు పేర్కొన్నాయి. రెండు కూటముల మధ్య పోటీ హోరాహోరీగా ఉన్నప్పటికీ మొగ్గు స్పష్టంగా లౌకికకూటమి వైపే ఉన్నట్లు ఇవి తెలిపాయి.
చివరిదైన ఐదోదశ ఎన్నికలు గురువారం ముగిసిన అనంతరం వివిధ సంస్థలు తమ సర్వేల ఫలితాలను వెల్లడించాయి. బిహార్ శాసనసభ మొత్తం స్థానాలు 243. కనీస మెజారిటీకి 122 సీట్లు అవసరం. 2010లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జెడీయు, బిజెపి కలిసి పోటీ చేసి ఘనవిజయం సాధించాయి.
జేడీయూ 115, బిజెపి 91 సీట్లతో మొత్తంగా కూటమి 206 స్థానాలను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించాయి. ఆ ఎన్నికల్లో లాలూ పార్టీ ఆర్జేడీ 22 స్థానాలకు, కాంగ్రెస్ కేవలం 4 స్థానాలకు పరిమితమయ్యాయి. తాజా సర్వేలు కొన్ని ఎన్డీయేకు, కొన్ని జేడీయు వైపు మొగ్గు చూపుతున్నాయి.












Click it and Unblock the Notifications