కేంద్రం జోక్యం మంచిదికాదు, పాత పద్ధతే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: జడ్జీల నియామకంపై శుక్రవారం సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. పాత పద్ధతిలోనే జడ్జీల నియామకం జరగాలని సుప్రీం తేల్చి చెప్పింది. జడ్జీల నియామకంలో కేంద్రం జోక్యం న్యాయవ్యవస్థకు మంచిది కాదని స్పష్టం చేసింది.
ఎన్ జేఏసి ఏర్పాటు నిర్ణయం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. జడ్జీల నియామకంపై కమిషన్ ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.
కాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్, న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఇప్పటిదాకా ఉన్న కొలీజియం వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసిన ప్రభుత్వం కొత్తగా ‘నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్ మెంట్ కమిషన్(ఎన్జేఏసి)'ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
తొలుత లోక్సభ, ఆ తర్వాత రాజ్యసభలో ఆమోదం లభించిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 13 నుంచి నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్ మెంట్ కమిషన్ అమల్లోకి వచ్చింది. అయితే జ్యుడీషియల్ కమిషన్పై ఆది నుంచి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులతో పాటు న్యాయ కోవిదులు కూడా ఆసంతృప్తి వ్యక్తం చేశారు.
గతంలో సుప్రీం చీఫ్ జస్టిస్ లుగా పనిచేసిన ఇద్దరు న్యాయమూర్తులు బహిరంగంగానే ఈ వ్యవస్థను తప్పుబట్టారు. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించింది.
విచారణ సందర్భంగా జ్యుడీషియల్ కమిషన్ రాజ్యంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులు ముక్తకంఠంతో వ్యాఖ్యానించారు. పాత పద్దతి (కొలీజియం వ్యవస్థ) ద్వారానే న్యాయమూర్తుల నియామకాలను చేపట్టాలని తీర్పు చెప్పింది.