అవేమీ వద్దు: అధికారులకు యోగి సీరియస్ వార్నింగ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలువురు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగి పర్యటనలకు, పరామర్శలకు వెళ్లిన సమయంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే.
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలువురు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం యోగి పర్యటనలకు, పరామర్శలకు వెళ్లిన సమయంలో ఆగమేఘాల మీద రెడ్ కార్పెట్లు పరిచి, సోఫాలు, ఏసీలను అమర్చి, ఆ కార్యక్రమం ముగియగానే వాటిని తీసేయడం తెలిసిందే.
ఈ విధంగా చేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న అధికారులకు యోగి హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై తన కోసం ఎటువంటి విలాస వస్తువులనూ అమర్చరాదని, ఎక్కడా ఏసీలు, సోఫాలను వేయవద్దని, ప్రత్యేక ఏర్పాట్లకు దూరంగా ఉండాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఇటీవల బీఎస్ఎఫ్ హెడ్కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్.. పాక్ ముష్కరుల చేతిలో మరణించగా, అతని ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను యోగి పరామర్శించారు. ఆ సమయంలో కూడా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.
కాగా, ప్రేమ్ సాగర్ ఇంట్లో ఏసీ, సోఫాలను అమర్చిన అధికారులు, ఆయన వెళ్లిపోగానే వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలోనే యోగి ఆదిత్య నాథ్ ప్రత్యేక ఏర్పాట్లపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications