ఆర్యన్ ఖాన్ కు మరోసారి చుక్కెదురు-బెయిల్ పై మళ్లీ నిరాశే -బుధవారం వరకూ జైల్లోనే
డ్రగ్స్ కేసులో అరెస్టైన బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఇవాళ మరోసారి చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన ముంబై సెషన్స్ కోర్టు .. తీవ్ర వాదోపవాదాల అనంతరం తన తీర్పును ఈ నెల 20కి రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్యన్ ఖాన్ వచ్చే బుధవారం వరకూ జైల్లోనే ఉండాల్సిన పరిస్దితి ఎదురవుతోంది.
ఇవాళ ముంబై సెషన్స్ కోర్టులో మరోసారి ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. ఆర్యన్ ఖాన్ తరఫు వాదించిన ప్రముఖ లాయర్ అమిత్ దేశాయ్.. డ్రగ్స్ కేసులో ఎన్సీబీ తీసుకుంటున్న చర్యల్ని ప్రశంసిస్తూనే తన క్లయింట్ కు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని ఎన్సీబీ కాలరాస్తుందని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో స్పందించిన ఎన్సీబీ లాయర్లు.. ఆర్యన్ ఖాన్ ముూడేళ్లుగా డ్రగ్స్ ఎడిక్ట్ అని, రోజూ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. దీంతో ఆర్యన్ ఖాన్ ఏదో యథాలాపంగా ఈ కేసులో ఇరుక్కోలేదని తేల్చిచెప్పేశారు.
ఆర్యన్ ఖాన్ కు ఈ కేసులో బెయిల్ ఇస్తే దర్యాప్తుకు అడ్డంకిగా మారతాడని, ఆధారాలను మాయం చేసే అవకాశం కూడా ఉంది ఎన్సీబీ లాయర్లు కోర్టులో వాదించారు. దీంతో బెయిల్ మంజూరు చేస్తే ఆర్యన్ ఖాన్ కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తాడన్న వాదనను ఆయన లాయర్లు తిప్పికొట్టారు. కేసు దర్యాప్తుపై అతని బెయిల్ ఎలాంటి ప్రభావం చూపలేదని వాదించారు. దీంతో ఇరువురి వాదనలు విన్న న్యాయస్ధానం అతని బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగించి తీర్పును మాత్రం ఈ నెల 20వ తేదీకి రిజర్వు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్ ను పోలీసులు తిరిగి ముంబై ఆర్ధర్ రోడ్ జైలుకు తరలించారు.
మరోవైపు ఆర్యన్ ఖాన్ తో పాటు డ్రగ్స్ కేసులో అరెస్టైన మరో ఐదుగురికి ముంబై ఆర్ధర్ రోడ్ జైల్లో నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడంతో వీరిని క్వారంటైన్ బ్లాక్ నుంచి ఉమ్మడి సెల్ కు పంపుతున్నట్లు ఆర్దర్ రోడ్ జైల్ సూపరింటెండెంట్ తెలిపారు. మరోవైపు ఈ కేసులో బీజేపీ నేతలతో పాటు ఎన్సీబీపై ఆరోపణలు చేసిన మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ కు బెదిరింపులు రావడంతో ఆయనకు అదనపు భద్రత కల్పించాలని ఉద్ధవ్ ధాక్రే సర్కార్ నిర్ణయించింది.