చంద్రబాబు వ్యాఖ్యలపై మోడీకి ఆగ్రహం: టీలో ఒక్కరే
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో తెలంగాణలో వేదికను పంచుకోవడానికి బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఎన్డియే బ్యానర్పై జరిగే వేదికల మీద మాత్రమే ఇతర భాగస్వామ్య పక్షాలతో పాటు చంద్రబాబుతో కూడా నరేంద్ర మోడి వేదికను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మోడీకి ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం. అయితే, బాబుపై విభేదాలు ఉన్నప్పటికీ పొత్తును కొనసాగించాలనే నిర్ణయంతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం.
ఈ నెల 22 లేదా 24 తేదీల్లో నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో మోడీ మూడు బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని సమాచారం. మొదటి రెండు బహిరంగ సభల్లో మోడీ మాత్రమే ఉంటారు. మొదటి సభ నిజామాబాద్లో ఉదయం 11 గంటలకు, రెండో సభ కరీంనగర్లో మధ్యాహ్నం మూడు గంటలకు ఉంటాయి.
చంద్రబాబుకు వెసులుబాటు కల్పించడానికి అదే రోజు హైదరాబాదులో బహిరంగ సభ నిర్వహించాలని బిజెపి నాయకులు భావిస్తున్నారు. నిజామాబాదులో పార్టీ అభ్యర్థి యెండల లక్ష్మినారాయణకు, కరీంనగర్ బిజెపి అభ్యర్థి సిహెచ్ విద్యాసాగర రావు కోసం నరేంద్ర మోడీ ప్రచారం చేస్తారు. హైదరాబాదు బహిరంగ సభ మాత్రం ఎన్డియే వ్యవహారంగా జరుగుతుంది.
హైదరాబాదు బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాత్రమే కాకుండా శివసేన, ఆకాలీదళ్, లోక్ జనసక్తి, ఇతర ఎన్డియే భాగస్వామ్య పక్షాల నాయకులు పాల్గొంటారు. మహబూబ్నగర్లో కూడా మోడీ సభ పెట్టించాలని ఆ లోకసభ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి పార్టీ నాయకులను కోరుతున్నారు. మోడీ ఇటీవలే ముఖ్యమంత్రి అయ్యారని, తాను ఇరవై ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రిగా చేశానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మోడీకి ఆగ్రహం తెప్పించినట్లు చెబుతున్నారు.