స్పష్టత రాలేదు: టీబిల్లుపై కమల్నాథ్, బిజెపి ఫైర్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లును (తెలంగాణ బిల్లును) రాజ్యసభలో లేదా లోకసభలో ప్రవేశపెట్టే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్ తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. బిల్లును మొదట ఓ సభలో ప్రవేశపెట్టాలనే విషయంపై న్యాయసలహా కోరినట్లు ఆయన తెలిపారు. విభజన బిల్లులో ఆర్థిక ప్రభావం ఉందా, లేదా అనే విషయంపై స్పష్టత కోరినట్లు చెప్పారు.
తెలంగాణ బిల్లు ఈ రోజు రాజ్యసభ ముందుకు రాదని కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా చెప్పారు. బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టాలా లేదా నేరుగా లోకసభలో పెట్టాలా అనే విషయంపై చర్చ జరుగుతోందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. దానిపై ఈ రోజు స్పష్టత రావచ్చునని అన్నారు
సభ నడవకుండా కాంగ్రెసు సభ్యులే అడ్డుకుంటున్నారని బిజెపి రాజ్యసభ సభ్యుడు రవిశంకర్ ప్రసాద్ అన్నారు. సొంత పార్టీ పార్లమెంటు సభ్యులనే నియంత్రించలేని దుస్థితిలో కాంగ్రెసు పార్టీ ఉందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నా చేసినా చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు.
సభా నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. షరతులు లేని తెలంగాణకు తాము మద్దతు ఇస్తున్నామని చెబుతూ సీమాంధ్ర సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రజల సమస్యలపై తమకు స్పష్టత ఉందని చెప్పారు. కాంగ్రెసు తన వైఫల్యాన్ని తమ పార్టీ పైకి నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణపై సభలో గందరగోళం
రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటు ఉభయ సభల్లో సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు మంగళవారం ఆందోళనకు దిగారు. లోకసభ ప్రారంభమైన వెంటనే పార్లమెంటు సభ్యులంతా స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ మీరా కుమార్ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.
రాజ్యసభలో కూడా అదే పరిస్థితి నెలకొంది. సభ ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు చేరుకుని ప్లకార్డులు ప్రదర్శిస్తూ సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో చైర్మన్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం తిరిగి రాజ్యసభ ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో సభను చైర్మన్ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.