కరోనా సమూహ వ్యాప్తి లేదు, కేసులు ఎక్కువే కానీ.. : రెండో అతిపెద్ద దేశమని హర్షవర్ధన్
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత్ ఎంతో ముందే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. దేశంలో కరోనా సమూహ వ్యాప్తి దశలో లేదని ఆయన వ్యాఖ్యానించారు. భారత్లో కరోనా వ్యాపిస్తున్న తీరుపై హర్షవర్ధన్ పలువురు మంత్రులతో సమావేశం నిర్వహించారు.

జనాభాలో రెండో అతిపెద్ద దేశం..
ఈ సందర్భంగా మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే కరోనా కేసుల నమోదులో భారత్ మూడో స్థానంలో కొనసాగుతున్నప్పటికీ ఈ పరిణామాన్ని సరైన కోణంలో అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు. జనాభా పరంగా భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమని అన్నారు. మనదేశంలో ప్రతి 10 లక్షల మందికి 538 కరోనా కేసులు నమోదవుతుండగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ సంఖ్య 1453గా ఉందని తెలిపారు.

దేశంలో సమూహ వ్యాప్తి లేదు..
ఇప్పటి వరకు దేశంలో కరోనా బారినపడిన వారిలో దాదాపు 62.08 శాతం మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారని హర్షవర్ధన్ వెల్లడించారు. మరణాల రేటు 2.75గా ఉందని చెప్పారు. కేవలం 8 రాష్ట్రాల్లోనే 90శాతం కేసులు నమోదవుతున్నాయని, వీటిలో ఆరు రాష్ట్రాల్లో 86 శాతం మరణాలున్నాయని మంత్రి వివరించారు. భారత్లో కరోనావైరస్ సమూహ వ్యాప్తి దశలో లేదని మరోసారి నిపుణులు స్పష్టం చేశారని తెలిపారు. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో వైరస్ సమూహ వ్యాప్తి జరిగి ఉండవచ్చు కానీ.. దేశం మొత్తం మీద ఎక్కడా కూడా సమూహ వ్యాప్తి లేదని ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ స్పస్టం చేశారు.
Recommended Video
కేసులు పెరుగుతున్నా.. వైద్య సదుపాయాలు పెరిగాయి..
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్నప్పటికీ ఐసీయూ, ఆక్సిజన్ సదుపాయాలు కలిగిన బెడ్లు, వెంటిలేటర్లు వంటి ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన పెంచుకుంటూ పోవడం ద్వారా కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటున్నామని తెలిపారు. అందుకే రికవరీ రేటు కూడా పెరుగుతోందని అన్నారు. కాగా, దేశంలో ఇప్పటి వరకు కరోనా 7,91,001 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 2,75,824 యాక్టివ్ కేసులున్నాయి. 4,93,484 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 21,592 మంది కరోనా బారిన పడి మరణించారు. నమోదైన కేసుల్లో సగం కంటే ఎక్కువ మంది కోలుకోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications