lockdown:గుడ్న్యూస్, గత 14 రోజుల్లో 60 జిల్లాల్లో నో పాజిటివ్ కేసు.. జాబితా ఇదే...
కరోనా వైరస్ పేరు చెబితే చాలు జనం వణికిపోతున్నారు. దేశంలో పాజిటివ్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. అయితే గత 14 రోజుల్లో 60 జిల్లాల్లో మాత్రం పరిస్థితి ఆశాజనకంగా ఉంది. ఆయా జిల్లాల్లో ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదుకాకపోవడం ఊరట కలిగిస్తోంది.
3.4 నుంచి 7.5
లాక్ డౌన్ కన్నా ముందు వైరస్ కేసుల సంఖ్య రెట్టింపు 3.4 రోజుల్లో కాగా.. తర్వాత అది 7.5కి చేరింది. ఈ నెల 19 వరకు ఉన్న డేటాను అధికారులు వివరించారు. దేశ సగటు కన్నా ఎక్కువరోజులు రెట్టింపు కేసులు నమోదవుతున్న వివరాలను కూడా ప్రకటించింది. అందులో ఢిల్లీ 8.5, కర్ణాటక 9.2, తెలంగాణ 9.4, ఆంధ్రప్రదేశ్ 10.6, జమ్ముకశ్మీర్ 11.5, పంజాబ్ 13.1, ఛత్తీస్ గఢ్ 13.3, తమిళనాడు 14, బీహర్ 16.4 రోజులు పాజిటివ్ కేసులు డబుల్ అయ్యాయి.
20 రోజులకు మించి...
హర్యానాలో 20.1, హిమాచల్ ప్రదేశ్ 24.5, చండీగఢ్ కేంద్రప్రాంత పాలిత ప్రాంతం 25.4, అసోం 25.8, ఉత్తరాఖండ్ 26.6, లడాఖ్ 26.6 రోజులుగా ఉంది. ఒడిశాలో 39.8, కేరళలో 72.2 రోజుల్లో రెట్టింపు కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ సోకిన రోగులను డిశ్చార్జ్ చేశామని గోవా ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం గోవాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఏమీ లేవు అని అధికారులు వివరించారు.
28 రోజులుగా..
పుదుచ్చేరిలోని మహా, కర్ణాటకలోని కొడకు, ఉత్తరాఖండ్లోని పౌరి గర్హాల్ జిల్లాలో గత 28 రోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. గత 14 రోజులుగా 23 రాష్ట్రాలు/కేంద్రప్రాంత పాలిత ప్రాంతాల్లో గల 59 జిల్లాల్లో కూడా కొత్త పాజిటివ్ కేసులు రికార్డు కాలేదు. ఇందులో రాజస్థాన్లోని డంగర్పూర్, పాలి.. గుజరాత్లోని జామ్ నగర్, మోర్బి, గోవాలోని నార్త్ గోవా, త్రిపురలోని గోమతి జిల్లాలు చేరాయి.
77 మంది విదేశీయులు
మంగళవారం నాటికి దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 18 వేల 601కి చేరగా.. మృతుల సంఖ్య 590కి చేరింది. 14 వేల 759 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 3 వేల 251 మందికి నయం కావడంతో డిశ్చార్జ్ చేశారు. వీరిలో 77 మంది విదేశీయులు ఉన్నారని కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.
Recommended Video