మాతో పెట్టుకోవద్దు: ఇంచ్ భూమినీ ఆక్రమించుకోలేరు: ఆ గ్యారంటీ లేదు: చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్
లేహ్: భారత్కు చెందిన ఇంచ్ భూమిని కూడా ఆక్రమించునే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత భూమిపై కన్నేసిన వారిని కుట్రలు, వ్యూహాలను తిప్పికొట్టగలిగే శక్తిసామర్థ్యాలు సైన్యానికి ఉన్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఏ దేశం కూడా భారత్తో సరిహద్దు వివాదాలను పెట్టుకోలేని విధంగా రక్షణాత్మక చర్యలను తీసుకుంటున్నామని అన్నారు. చైనా, పాకిస్తాన్లకు ఆయన పరోక్షంగా హెచ్చరికలను పంపించారు.
లేహ్లో రక్షణమంత్రి
లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ విషయంలో భారత్-చైనా మధ్య ప్రస్తుతం కొనసాగుతోన్న చర్చలు ఫలిస్తాయనే గ్యాంరటీ తనకు ఏ మాత్రం లేదని తేల్చి చెప్పారు. రాజ్నాథ్ సింగ్ రెండో రోజుల లఢక్, శ్రీనగర్ పర్యటన శుక్రవారం ఆరంభమైంది. ఈ ఉదయం ఆయన దేశ రాజధాని నుంచి ప్రత్యేక విమానంలో లేహ్కు బయలుదేరి వెళ్లారు. ఈ సమయంలో ఆయన వెంట ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె, సీడీఎస్ చీప్ బిపిన్ రావత్ ఉన్నారు. కొద్దిరోజుల కిందట ఇదే ప్రాంతాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందర్శించారు.
సరిహద్దుల్లో ఆర్మీ విన్యాసాలు..
భారత్-చైనాలను వేరు చేసే వాస్తవాధీన రేఖ సమీపంలోని స్కట్నా గోంపా ప్రాంతంలో సరిహద్దు జవాన్లు విన్యాసాల్లో పాల్గొన్నారు. ఎయిర్ డ్రాపింగ్ సహా పలు విన్యాసాలను ఆయన తిలకించారు. చైనాతో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరువాత వాస్తవాధీన రేఖ వెంబడి మోహరింపజేసిన భద్రతాల బలగాలు, అనురిస్తోన్న వ్యూహాల గురించి సైన్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. చైనాతో ఘర్షణల్లో అమరులైన 20 మంది సైనికులకు నివాళి అర్పించారు. సరిహద్దు భద్రతా జవాన్లతో ముచ్చటించారు. అనంతరం సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
చర్చలు ఫలిస్తాయనే గ్యారంటీ లేదు..
భారత భూమిని ఇంచి కూడా ఆక్రమించుకునే ధైర్యం ప్రపంచంలో ఏ ఒక్క దేశానికీ లేదని అన్నారు. అలాంటి ఆలోచన కూడా చేసే సాహసానికి పూనుకోలేరని చెప్పారు. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడంపై చైనాతో భారత ఆర్మీ అధికారుల చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికి వివిధ దశల్లో సుదీర్ఘకాలం పాటు చర్చలు కొనసాగాయని అన్నారు. మున్ముందు- ఈ రెండు దేశాల ఆర్మీ అధికారుల మధ్య మరిన్ని చర్చలకు అవకాశాలు లేకపోలేదనే సంకేతాన్ని ఇచ్చారు రాజ్నాథ్ సింగ్. ఆ చర్చలు ఫలిస్తాయనే గ్యారంటీ మాత్రం తనకు లేదని కుండబద్దలు కొట్టారు.
Recommended Video
చర్చలు ఫలిస్తాయనే ఎలా చెప్పగలను?
భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడం చేపట్టిన చర్చల ప్రక్రియ ఫలిస్తుందనే నమ్మకం తనకు లేదని రాజ్నాథ్ తేల్చి చెప్పారు. అవి ఫలిస్తాయనే తానెలా చెప్పగలనని అన్నారు. చర్చలు ఫలించినా, ఫలించకపోయినా.. భారత భూమిని ఇంచి కూడా ఆక్రమించుకోనివ్వకుండా పొరుగు దేశాన్ని నియంత్రించగలుగుతామనే ధీమాను ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఉద్రిక్త పరిస్థితులను నియంత్రంచడానికి తమవంతు ప్రయత్నాలు ఇప్పటికే చేశామని, మున్ముందు వాటిని కొనసాగిస్తామనీ రాజ్నాథ్ సింగ్ చెప్పారు.