మే 3 తర్వాత దేశం ఎలా?: రైలు, విమాన ప్రయాణాలు, మాస్కులు తప్పనిసరి: ప్రభుత్వ ప్రణాళికలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు తగ్గకపోవడంతో కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు లాక్డౌన్ను పొడిగించిన విషయం తెలిసిందే. మొదటి లాక్డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగగా.. రెండో లాక్డౌన్ను మే 3 వరకు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, మే 3 తర్వాత పూర్తిగా లాక్డౌన్ ఎత్తివేసే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.

మే 3 తర్వాత ప్రయాణాలు..
మే 3 తర్వాత రైళ్లు, విమానాలు పూర్తిగా సేవలు అందించే అవకాశం లేదు. ఎక్కువగా ఆయా రాష్ట్రాల పరిధిలోనే సేవలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాహనాలకు కూడా ఆయా నగరాల్లోనే అనుమతించే అవకాశం ఉంది.

మాస్కులు తప్పనిసరి..
అంతేగాక, లాక్డౌన్ ముగిసిన తర్వాత కూడా సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పనిసరిగా కొనసాగనున్నాయి. ఈ మేరకు ఇళ్ల నుంచి బయటికి వచ్చేవారికి ప్రభుత్వాలు మార్గదర్శకాలు జారి చేసే అవకాశాలున్నాయి.
అయితే, వివాహాలు, మత సంబంధ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో గుమిగూడేందుకు అనుమతులు ఇవ్వకపోవచ్చు.

కరోనా ప్రభావాన్ని బట్టి సడలింపులు
ఇక నిత్యావసర వస్తువులు అమ్మే దుకాణాలు కూడా సామాజిక దూరం పాటిస్తూ తమ కార్యకలాపాలను కొనసాగించాల్సి ఉంటుంది. దేశంలో కరోనా ప్రభావాన్ని బట్టి కూడా పలు ప్రాంతాల్లో ఆంక్షలను సడలించడం, కొనసాగించడం లాంటి చర్యలను ప్రభుత్వం చేపట్టనుంది. గ్రీన్ జోన్లలో అనుమతించే కార్యకలాపాలను రెడ్ జోన్లలో అనుమతించే అవకాశం లేకపోవచ్చు. ముంబై, ఢిల్లీ, నోయిడా, ఇండోర్ లాంటి నగరాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో మే 3 తర్వాత కూడా ఈ నగరాల్లో ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది.

మే 15 తర్వాతే..
దేశంలో కరోనా పరిస్థితిపై మే 15 వరకు ఖచ్చితమైన అవగాహన వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, మంగళవారం నాటికి దేశంలో 18వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 600 మరణాలు సంభవించాయి. ఏప్రిల్ 20 నుంచి అత్యవసర సేవలు, వ్యవసాయ సంబంధ పనులకు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పంజాబ్, ఢిల్లీలు మే 3 వరకు ఎలాంటి సడలింపులు లేవని ప్రకటించాయి.


Click it and Unblock the Notifications