గుండె తరలింపునకు ఆగిన ట్రాఫిక్: నిలిచిన ప్రాణం
చెన్నై: ప్రమాదాలకు గురైన ఎంతోమంది ట్రాఫిక్ సమస్య కారణంగా సరైన సమయంలో ఆస్పత్రులకు చేరలేక ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. అయితే ఇక్కడ అలా జరగలేదు. ఓ ప్రాణాన్ని నిలబెట్టేందుకు తమిళనాడులోని చెన్నై నగరంలోని ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. 14 నిమిషాల్లో ఓ ఆస్పత్రి నుంచి గుండెను సురక్షితంగా తీసుకువచ్చి మరో వ్యక్తికి అమర్చే ప్రక్రియను చెన్నై వైద్యులు విజయవంతంంగా పూర్తి చేశారు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది.
ప్రభుత్వ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండె తీసి, అడయార్లోని ఫోర్టిన్ మలార్ ఆస్పత్రిలో ఎంతో కాలంగా గుండె మార్పిడి కోసం వేచివున్న రోగికి అమర్చారు. ఈ రెండు ఆస్పత్రుల మధ్య 12 కిలోమీటర్ల దూరం.. మరోవైపు తీవ్రమైన ట్రాఫిక్ కారణంగా అక్కడ్నుంచి ఇక్కడికి 45 నిమిషాలకు తక్కువ సమయం పట్టదు. అయితే పోలీసులు, ప్రజలు, వైద్యుల సహకారంతో ఆ గుండెను తీసుకొచ్చే అంబులెన్స్ 13 నిమిషాల 22 సెకండ్లలో చేరుకుంది.

ఓ 27ఏళ్ల వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అవడంతో ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అతడి గుండె ఆరోగ్యంగా ఉండటంతో వైద్యులు సోమవారం ఉ. 5.45 గంటలకు ఫోర్టిన్ మలార్ ఆస్పత్రికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఆస్పత్రి వైద్యులు, పోలీసుల సహాయం తీసుకున్నారు. రెండు ఆస్పత్రుల మధ్య ట్రాఫిక్ ఆపేసి, ఎక్కడా రెడ్ సిగ్నల్ పడకుండా జాగ్రత్త పడటంతో అంబులెన్స్ వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఆస్పత్రికి చేరుకుంది.
అప్పటికే సిద్ధంగా ఉన్న వైద్యులు వెంటనే శస్త్ర చికిత్స చేశారు. వ్యక్తి మరణించిన తర్వాత 4 గంటల పాటు మాత్రమే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే వెంట వెంటనే స్పందించిన వైద్యులు, పోలీసులు ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టారు. 5.45గంటలకు గుండె ఉందనే సమాచారం వస్తే.. ఆ గుండెను 10.15గంటలకు రోగికి అమర్చిన వైద్యులు విజయవంతమయ్యారు. దీంతో ఆ గుండె మళ్లీ స్పందించడం మొదలుపెట్టింది. ఇలాంటి ఘటనే ఇటీవల హైదరాబాద్లోనూ చోటు చేసుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications