ఆ ఐదు ప్రధాన నగరాల్లో లాక్ డౌన్ లేదు.. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు నిన్న సాయంత్రం ఐదు ప్రధాన నగరాల్లో లాక్ డౌన్ విధించాలని ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేసిన ఉత్తరప్రదేశ్ సర్కార్ కు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. లక్నో, ప్రయాగ్ రాజ్, వారణాసి, కాన్పూర్, గోరక్ పూర్ లో ఈనెల 26వ తేదీ వరకు లాక్ డౌన్ విధించాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది .

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఊరటనిచ్చిన సుప్రీం కోర్టు
అలహాబాద్ హైకోర్టు నిన్న సాయంత్రం ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట లభించింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఐదు ప్రధాన నగరాలలో లాక్ డౌన్ ఉండబోదని తెలుస్తుంది. ఇదే సమయంలో కరోనా కట్టడి కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వారంలోపు సుప్రీం కోర్టుకు నివేదించమని ధర్మాసనం ఆదేశించింది. జ్యుడీషియల్ ఆర్డర్ ద్వారా ఐదు నగరాలను లాక్ డౌన్ చేయడం సరైన విధానం కాకపోవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ఐదు నగరాల్లో హైకోర్టు లాక్ డౌన్ ఇబ్బందులను సృష్టిస్తుందన్న యూపీ సర్కార్
ఐదు నగరాల్లో హైకోర్టు విధించిన లాక్ డౌన్ అపారమైన పరిపాలనా ఇబ్బందులను సృష్టిస్తుందని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిని ఉల్లంఘించిందని పేర్కొంది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం నిన్న సాయంత్రం అలహాబాద్ హైకోర్టు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐదు ప్రధాన నగరాలలో లాక్ డౌన్ విధించాలని ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికి నిరాకరించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉదయం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

సుప్రీంలో వాదన వినిపించిన యూపీ ప్రభుత్వం తరపు న్యాయవాది
ఈ మేరకు సుప్రీం కోర్టులో యుపి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తుషార్ మెహతా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు . ప్రజా జీవనాన్ని ఇబ్బందులకు గురి చేసే లాక్ డౌన్ అవసరం లేదని, సామాన్య ప్రజల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకొని లాక్ డౌన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చూడాలని సుప్రీంకు యూపీ సర్కార్ విజ్ఞప్తి చేసింది.
ఇదిలా ఉంటే గత 24 గంటల్లో యుపి రికార్డు స్థాయిలో దాదాపు 30,000 కొత్త కేసులను నివేదించింది.

కరోనా ఉధృతి నేపధ్యంలో యూపీలో వారాంతపు కర్ఫ్యూ
పెరుగుతున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారాంతపు కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయించింది. శుక్రవారం సాయంత్రం 8 గంటల నుండి సోమవారం ఉదయం ఏడు గంటల వరకు వారాంతపు కర్ఫ్యూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమలు కానుంది.
ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కరోనా కట్టడి యత్నాలలో భాగంగా వారాంతపు కర్ఫ్యూలు , లాక్ డౌన్ లు కొనసాగుతున్నాయి . యోగీ సర్కార్ కూడా కరోనా కట్టడి కోసం ప్రస్తుతానికి వారాంతపు కర్ఫ్యూ విధించింది .












Click it and Unblock the Notifications