గుడిపడ్వా నుంచి మహారాష్ట్రలో మాస్కుల్లేవ్: ఢిల్లీలోనూ, పూర్తిగా నిబంధనలు ఎత్తేసిన బెంగాల్
ముంబై: కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతుండటంతో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు కరోనా నిబంధనలను సడలిస్తున్నాయి. తాజాగా, మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి రాష్ట్రంలో మాస్కులు ధరించడం తప్పనిసరి కాదని మహారాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటనలో తెలిపింది.
మరాఠీ నూతన సంవత్సరం అయిన గుడిపడ్వా సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని తెలిపింది. కొవిడ్ నియంత్రణలు తొలగింపబడినప్పటికీ.. వైరస్తో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మాస్కులు వాడటం, వాడకపోవడం అనేది ప్రజల వ్యక్తిగత అభిప్రాయమని, అది తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో 700-800 కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని, పాజిటివిటీ రేటు 4 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, కోవిడ్ టాస్క్ఫోర్స్తో సంప్రదింపుల ప్రకారం అన్ని నిబంధనలు ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మరోవైపు, దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కోవిడ్-19 పూర్తిగా అదుపులోకి వస్తున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
మార్చి 31 నుంచి కోవిడ్-19 నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది. అయితే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు కొనసాగుతాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఒకవేళ రాష్ట్రాలలో కేసులు పెరిగితే స్థానిక ప్రభుత్వాలు నిబంధనలు విధించుకోవచ్చని కేంద్ర హోం శాఖ సూచించింది.
కాగా, ఢిల్లీ ప్రభుత్వం కూడా మాస్కులు ధరించడం తప్పనిసరి కాదని, అవసరం ఉన్నవారు ధరించవచ్చని పేర్కొంది. ఇది ఇలావుంటే, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కూడా కరోనా కేసులు క్రమంగా తగ్గుతుండటంతో కరోనా నిబంధనలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.












Click it and Unblock the Notifications