అమీర్ ఖాన్ను వెళ్లిపోవాలని అనలేరు: దీదీ బాసట
కోల్కత: ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాసటగా నిలిచారు. ఆమీర్ ఖాన్ తప్పుగా ఏమీ మాట్లాడలేదని, తన మనసులోని మాటలను మాత్రమే చెప్పాడని ఆమె మద్దతు పలికారు. అది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఉన్న హక్కని అన్నారు.
భారతదేశం ప్రతి ఒక్కరిదని, ఆమీర్ను దేశం విడిచి వెళ్లాలని చెప్పే హక్కు ఎవరికీ లేదని అన్నారు. పాకిస్తాన్కో మరో దేశానికో వెళ్లాలని చెప్పే హక్కు ఎవరికీ లేదని, ఈ దేశం మన అందరిదని మమత అన్నారు. పనిలోపనిగా హిందూత్వ గ్రూపులపై మండిపడ్డారు.

బీఫ్ తిన్నారనే నెపంతో చంపడం సరికాదని, మనదేశంలో అందరికీ అన్ని హక్కులు ఉన్నాయని అన్నారు. ఆమిర్ భార్య తనతో అన్న మాటలను ఆయన బయటకు చెప్పాడని, అందులో తప్పేముందని మమతా అన్నారు. అంతమాత్రానికే వారిని దేశం విడిచి వెళ్లాలని అడగడానికి మీరెవరని, ఇది మన మాతృభూమి అని మమత అన్నారు.
మైనారిటీలు గురువారం నిర్వహించిన ర్యాలీని ఉద్దేశించి మమత ఈ వ్యాఖ్యలు చేశారు. షారూక్ ఖాన్కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను కూడా ఆమె వ్యతిరేకించారు. షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, ఎఆర్ రెహ్మాన్ వంటి వారిని వారు విమర్శిస్తున్నారని, ఏం మాట్లాడాలో ఏది తినాలో చెప్పడానికి వారెవరని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications