కాంగ్రెస్ నాయకత్వాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు: సోనియాతో భేటీ తర్వాత గులాంనబీ ఆజాద్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీతో ఆ పార్టీలోని జీ-23 బృందంలో కీలక నేత గులాంనబీ ఆజాదా్ భేటీ ముగిసింది. సుమారు గంటకుపైగా ఈ భేటీ జరిగింది. న్యూఢిల్లీలోని 10 జన్పథ్లోని సమావేశం అనంతరం ఆజాద్ మీడియాతో మాట్లాడారు. పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో శత్రువులను ఐక్యంగా ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించినట్లు వెల్లడించారు.
సోనియా గాంధీతో భేటీ కావడం తరచుగా జరిగే ప్రక్రియేనని, ఇది మీడియాకు వార్తే కావొచ్చన్నారు. పార్టీ సంస్థాగతంగా బలోసేతం చేసేందుకు సోనియా గాంధీ చర్చలు జరుపుతున్నారనీ, ఇటీవల జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా పార్టీని ఎలా బలోపేతం చేయాలి? ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమికి కారణాలేంటి? అనే అంశాలపై సోనియా సభ్యుల సూచనలు కోరారని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం తాను కూడా సలహా ఇచ్చినట్లు చెప్పారు.
తాను చేసిన సూచనలు పార్టీ అంతర్గత విషయాలనీ, వాటిని బహిర్గతం చేయలేనన్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగాలని ఏకగ్రీవంగా ఆమోదం జరిగిందన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఎవరూ ప్రశ్నించలేదని గులాంనబీ ఆజాద్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒకటేనని, అధ్యక్షులు కూడా ఒకరే ఉంటారని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో సమష్టి నాయకత్వ కోసం జీ-23 నేతలు బలంగా డిమాండ్ చేస్తున్నవేళ ఆజాద్తో సోనియా భేటీ కావడం కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత జీ-23 నేతలు వరుస భేటీలు అయిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి తర్వాత జీ23 నేతలు కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే, గులాంనబీ ఆజాద్ మాత్రం కొంత కాంగ్రెస్ నాయకత్వానికి సానుకూలంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీతో ఆయన భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు జీ-23 నేతల్లో ఒకరైన హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా గురువారం రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. దాదాపు గంటకుపైగా సాగిన భేటీలో జీ23 నేతల అభిప్రాయాలు, పార్టీ పరిస్థితిపై చర్చించినట్లు సమాచారం. జీ-23లోని కీలక నేతలు సోనియా, రాహుల్ లతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. రెబల్ నేతలను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జీ23లోని మెజార్టీ నేతలు కూడా సోనియా, రాహుల్ నాయకత్వాన్ని వ్యతిరేకించకపోవడం గమనార్హం.