చైనాకే కాదు.. లేటెస్ట్గా పాకిస్తాన్కూ కోతల వాత పెట్టిన భారత్: పాక్ తేరుకోలేదిక: రాష్ట్రాలకు
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద సరిహద్దు వివాదాలను యుద్ధం వరకూ తీసుకెళ్లిన చైనా తోకను కత్తిరించేలా కేంద్ర ప్రభుత్వం మరోసారి అడుగు ముందుకేసింది. ఈ సారి చైనా.. దాని మిత్రదేశం పాకిస్తాన్ను కూడా కలుపుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రెండు దేశాలను ఆర్థికంగా ఇక్కట్లలోకి నెట్టేలా కేంద్రం ఈ తాజా నిర్ణయాన్ని తీసుకుంది. చైనా, పాకిస్తాన్ల నుంచి భారీ విద్యుత్ పరికరాలను కొనుగోలు చేయకూడదని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడించారు.
శుక్రవారం ఆయన దేశ రాజధాని నుంచి వర్చువల్ విధానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చైనా, పాకిస్తాన్ల నుంచి ఎలాంటి విద్యుత్ పరికరాలను కొనుగోలు చేయకూడదని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (డిస్కమ్)లకు ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేనిదే విద్యుత్ పరికాలను కొనుగోలు చేయకూడదని స్పష్టం చేశారు. తమ మంత్రిత్వశాఖ ఆదేశించిన తరువాతే కొనుగోళ్లను జరపాల్సి ఉంటుందని ఆర్కే సింగ్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం భారత్ ప్రతి సంవత్సరమూ 71 వేల కోట్ల రూపాయల విలువ చేసే విద్యుత్ పరికరాలు, ఇతర సామాగ్రిని దిగుమతి చేసుకుంటోంది.. చైనా, పాకిస్తాన్ సహా. ఇందులో ఒక్క చైనా వాటా మాత్రమే 21 వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటోంది. ఈ సారి ఈ రెండు దేశాల నుంచి విద్యుత్ పరికరాలను కొనుగోళ్లను నియంత్రించాలని, వీలైతే నిషేధించాలని ఆర్కే సింగ్ ఆదేశించారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాల విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారులకు లేఖ రాయనున్నట్లు తెలిపారు.
చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాల అనంతరం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చైనాతో వ్యాపార, వాణిజ్య సంబంధాలను తెంచుకుంది భారత్. రోడ్డు కాంట్రాక్టు పనులు, రైల్వే విద్యుదీకరణ పనులు, ఎలక్ట్రానిక్ గూడ్స్ వంటి కొనుగోళ్లను నిలిపివేసింది. చైనాకు చెందిన ఏ ఒక్క కాంట్రాక్టర్కు కూడా భారత్లోని వేర్వేరు ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం లేకుండా చేసింది. ఫలితంగా వందల కోట్ల రూపాయల ఆర్థిక నష్టాన్ని చైనా కాంట్రాక్టర్లు చవి చూస్తున్నారు.
ఇప్పటికే 59 చైనా యాప్లను కేంద్రం నిషేధించింది. ఫలితంగా ఆ రంగంలోనూ చైనాకు దెబ్బపడింది. ఇక తాజాగా విద్యుత్ పరికరాల కొనుగోళ్లను కూడా నిలిపివేయల్సి రావడంతో ఈ రెండు దేశాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. చైనాతో పోల్చుకుంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఏ మాత్రం బలంగా లేదు. అలాంటి సమయంలో భారత్ విద్యుత్ పరికరాల కొనుగోళ్లను నిలిపేయడం పాక్పై పిడుగుపాటులా మారే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్.. చైనాకు మిత్రదేశంగా ఉండటం వల్లే కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుందనడంలో సందేహాలు అక్కర్లేదని వ్యాఖ్యానిస్తున్నారు.