దారుణంగా మాట్లాడా, ఒప్పుకుంటున్నా: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వాటిని వెనక్కి తీసుకునేది లేదని చెబుతున్నారు. ఆయన ఓ ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రధాని మోడీని పిరికివాడంటూ కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు.
దీనిపై ఛానల్ ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ మాట్లాడుతూ... తాను ఆ వ్యాఖ్యలకు పశ్చాత్తాపపడటం లేదన్నారు. నేను చాలా దారుణంగా మాట్లాడానని అంగీకరిస్తానని, వాటిని నేను హృదయం నుంచి మాట్లాడానని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోడీ తన వద్ద ఉన్న అన్ని కేంద్ర ఏజెన్సీలను తన పైకి ప్రయోగిస్తున్నారని, కానీ ఈ కేజ్రీవాల్ భయపడడని వ్యాఖ్యానించారు. సిబిఐతో సహా ఏ విచారణకు ఈ కేజ్రీవాల్ భయపడడని చెప్పారు. నా పైన ఎలాంటి దర్యాఫ్తునైనా వేసుకోవచ్చునని చెప్పారు.
ప్రధాని మోడీ ఇటీవల హఠాత్తుగా లాహోర్ పర్యటనకు వెళ్లడంపై మాట్లాడుతూ... మనం యుద్ధాన్ని కోరుకోవడం లేదన్నారు. పాకిస్తాన్తో బీఫ్రెండ్గా ఉండాలన్నారు.
ఢిల్లీ సచివాలయంలోకి వందమంది సిబిఐ అధికారులను పంపించి, అక్కడ ఉన్న ప్రతి ఫైల్ తనిఖీ చేసుకోవచ్చునని చెప్పారు. డిడిసిఎలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందన్నారు. నివేదికలో జైట్లీ పేరు లేకపోవడంపై ప్రశ్నించగా... ఏ విచారణ నివేదికలో కూడా ఎవరి పేరు ఉండదని వ్యాఖ్యానించారు. అవినీతి ఎవరూ చేయకుంటే, దెయ్యాలు చేశాయా అని ప్రశ్నించారు.