గందరగోళం మధ్య వద్దు: టిపై జైరామ్, కిరణ్ గీతదాటారు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును (తెలంగాణ ముసాయిదా బిల్లు) పార్లమెంటులో హడావుడిగా ఆమోదించరాదని కేంద్ర మంత్రి, జివోఎం సభ్యులు జైరాం రమేశ్ అభిప్రాయపడ్డారు. సిఎన్ఎన్ ఐబిఎన్ చానల్లో కరణ్ థాపర్ నిర్వహించే డెవిల్స్ అడ్వొకేట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తీవ్రస్థాయిలో ప్రభావం చూపే ఇటువంటి బిల్లును పార్లమెంటులో చర్చించాలని వాదించే వారిలో తాను మొదటి వాడినని, ఇంత ముఖ్యమైన బిల్లును తప్పనిసరిగా చర్చించాలన్నారు.
హింసాత్మక ఆందోళనలు చోటు చేసుకున్నప్పుడు గందరగోళం మధ్య బిల్లును ఆమోదించకూడదన్నారు. ప్రభుత్వ వ్యూహం ఏమిటో తనకు తెలియదన్నారు. ఈ అంశంపై పార్లమెంటులో ఏకపక్షంగా వెళ్లడం సాధ్యం కాదని, బిజెపిని కూడా దారికి తెచ్చుకోవాల్సి ఉందని, బిజెపితో కలిసి విస్తృత ఏకాభిప్రాయాన్ని కూడగట్టాల్సి ఉందని తెలిపారు. ఇందుకు నాలుగు రోజులే సమయం ఉందని, అయినా, మద్దతును కూడగడతామన్న విశ్వాసం తనకు ఉందని తెలిపారు.

ఇప్పటికే హోం మంత్రి షిండేతో మాట్లాడానని, బిల్లు ప్రవేశపెట్టామని ఆయన స్పష్టం చేశారని, కమల్ నాథ్ కూడా ఇదే విషయం చెప్పారని జైరాం తెలిపారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కిరణ్ తనకు మంచి మిత్రుడన్నారు.
కిరణ్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడు కాడనుకుంటానని వ్యాఖ్యానించారు. దురదృష్టవశాత్తు, ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని, తనకు మంచి మిత్రుడు కూడా అన్నారు. తనకు తెలిసినంత వరకు పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన లక్ష్మణ రేఖను ఆయన దాటేశాడన్నారు. తెలంగాణ బిల్లు తయారీలో రాజ్యాంగ ఉల్లంఘనలు లేవన్నారు. సభ జరగదనుకోవడం ఊహాతీతమని, అడ్డుకుంటున్న ఎంపీలను సస్పెండ్ చేశామని చెప్పారు.
సరైన చర్చ లేకుండా బిల్లును ఆమోదించవద్దని తాను పార్టీ వేదికల పైన చెబుతూ వస్తున్నానని తెలిపారు. సభలో బిల్లు పెట్టకుంటే మళ్లీ పెడతారన్నారు. సభలో బిల్లు పెట్టకుండా ఆమోదించడం కుదరదన్నారు.












Click it and Unblock the Notifications