వేడెక్కుతున్న తమిళ రాజకీయం: డిమాండ్ల పై వెనక్కు తగ్గని పన్నీరు.. వెనుక ఎవరున్నారు?
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ముందు ఉంచిన డిమాండ్ల విషయంలో పన్నీరు సెల్వం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. డిమాండ్లు నెరవేర్చేవరకు చర్చలు కూడా లేవంటూ ఆయన పట్టబట్టి కూర్చున్నారు.
చెన్నై: పన్నీరు సెల్వం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ముందు ఉంచిన డిమాండ్ల విషయంలో పన్నీరు వర్గీయులు హెచ్చరికలు చేసేలా మాట్లాడుతుండటంతో వారి వెనుక ఎవరున్నారన్నది తమిళ రాజకీయాల్లో చర్చనీయంశంగా మారింది.
జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే రెండు వర్గాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. శశికళ సారథ్యంలో ఏఐఏడీఎంకే (అమ్మ), పన్నీరు సెల్వం వర్గం ఏఐఏడీఎంకే పురచ్చి తలైవి అమ్మ పేర్లతో రెండు వర్గాలు ఏర్పడ్డాయి.
ఇప్పుడు అన్నాడీఎంకే రెండు గ్రూపులు విలీనం కావాలంటే.. పార్టీ నుంచి శశికళను, దినకరన్ను బహిష్కరించాల్సిందేనని, జయలలిత మృతిపై విచారణ చేయించాల్సిందేనని పన్నీరు వర్గం పట్టుబడుతోంది.
సీఎం పదవి కావాల్సిందే...
ఇప్పుడు ఈ రెండు వర్గాలు విలీనం కావాలంటే పై రెండు డిమాండ్లతో పాటు ముఖ్యమంత్రి పదవిని పన్నీరుకు ఇవ్వాలనే మరో డిమాండ్ కూడా వినిపిస్తోంది. అంతేకాదు, పార్టీ పదవి, మంత్రుల పదవులపైనా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.
డిమాండ్లు నెరవేర్చితేనే చర్చలు...
తమ డిమాండ్లు నెరవేరే వరకు చర్చల ప్రసక్తే లేదని పన్నీరు వర్గం తేల్చిచెబుతుండగా, మరోవైపు శశికళకు అనుకూలమైన సీఎం పళనిస్వామి వర్గం మాత్రం దీనిపై భిన్నస్వరాలు వినిపిస్తోంది.
మన్నార్గుడి మాఫియా నుంచి విముక్తి
సోమవారం పన్నీరు సెల్వం వర్గంలో ఉన్న ఎంపీ మైత్రేయన్ మీడియాతో మాట్లాడుతూ.. శశికళ, దినకరన్లను పార్టీ నుంచి బహిష్కరించి మన్నార్గుడి మాఫియా నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు.
అసలు పన్నీరు బలం ఎంత?
సీఎం పళనిస్వామి వర్గంలో 120 మంది ఎమ్మెల్యేలు ఉండగా, పన్నీరు సెల్వం వైపు కేవలం 12 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇటీవల జరిగిన విశ్వాస పరీక్షలో పన్నీరు వర్గం వ్యతిరేకించినా పళనిస్వామి నెగ్గారు.
డిమాండ్లకు సిద్ధంగా లేని పళనిస్వామి వర్గం
అయినా సరే తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న పన్నీరు వర్గం.. విలీనం చర్చల పేరుతో డిమాండ్లు పెడుతూ సీఎం పళనిస్వామికి చుక్కలు చూపిస్తోంది. పన్నీరు డిమాండ్లను అంగీకరించేందుకు పళని వర్గం విముఖత చూపుతోంది.
అప్పుడెందుకు విచారణకు ఆదేశించలేదు?
అమ్మ జయలలిత మరణంపై తమకెలాంటి సందేహాలూ లేవని, అలాంటపుడు ఆమె మృతిపై విచారణ ఎందుకనేది పళనిస్వామి వర్గం వాదన. అంతేకాదు, గతంలో పన్నీరు సీఎంగా ఉన్నప్పుడు దీనిపై విచారణకు ఎందుకు ఆదేశించలేదని కూడా ఆ వర్గం ప్రశ్నిస్తోంది.
పన్నీరు వెనుక బీజేపీ ఉందా?
తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీనే పన్నీరుకు మద్దతు ఇస్తూ నడిపిస్తోందని దినకరన్ చెప్పినట్టుగా పళని వర్గీయులు పేర్కొంటున్నారు. మరోవైపు పళని స్వామి వెంటే ఉంటే దినకరన్ విషయంలో మాదిరిగా తమను కూడా ఎక్కడ అవినీతి కేసుల్లో ఇరికిస్తారో అని కొందరు ఎమ్మెల్యేలు భయపడుతున్నట్లు సమాచారం.
అన్నీ అనుమానాలే.. మా జోక్యం ఏమీ లేదు
అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లగా, ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో దినకరన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు మూడు రోజులుగా ఆయన్ను విచారిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం ఈ అనుమానాలను తోసిపుచ్చుతోంది. అన్నా డీఎంకే రాజకీయాల్లో తమ జోక్యం ఏమీ లేదని బీజేపీ పెద్దలు చెబుతున్నారు.