కేంద్ర హోంశాఖ గైడ్ లైన్స్ : అత్యాచార బాధితులకు వర్జినిటీ టెస్టులు, డాక్టర్లు చేయరాదు
అత్యాచార బాధితులకు వైద్యం చేసే సమయంలో డాక్టర్లు కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుందని చెబుతూ ఆ దిశగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర హోంశాఖ. జూలై 25న విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారం అత్యాచార బాధితులు పట్ల రెండు విధాలుగా డాక్టర్లు తమ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇందులో మొదటిగా బాధితులకు ప్రాథమిక చికిత్స అందించి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేయడం. రెండవదిగా.. బాధితుల లీగల్ ప్రొసీడింగ్స్లో సహకరించడం వారికి కావాల్సిన రుజువులు ఇచ్చి డాక్యుమెంటేషన్కు సహాయపడాల్సిందిగా హోంశాఖ గైడ్ లైన్స్ జారీ చేసింది. ఆ మార్గదర్శకాలు ఉన్న లేఖను దేశవ్యాప్తంగా ఉన్న డీజీపీలకు పోలీస్ కమిషనర్లకు పంపించింది. లైంగిక వేధింపులకు గురైన మహిళలు చిన్నపిల్లల కేసులను ఎప్పటికప్పుడు ఫాలో చేసుకుంటూ ఉండాలని సూచించింది.
అత్యాచారానికి గురై చికిత్స కోసం వచ్చిన మహిళలను సాధారణంగా వైద్యులు పరీక్షిస్తారు. మహిళ యోనిలో రెండు వేళ్లు ఉంచి మహిళపై లైంగిక దాడి జరిగిందా లేదా అనే నిర్ధారణకు వస్తారు. ఈ పరీక్షలు చేయరాదని... యోని సైజు పై కూడా ఎలాంటి బహిర్గత రిపోర్ట్ రాయకూడదని వైద్యులకు గైడ్లైన్స్ జారీ చేసింది. కన్నెపొర, గతంలో మహిళకు ఉన్న లైంగిక అలవాట్లపైన కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని పేర్కొంది. లైంగిక దాడికి ఇలా వ్యక్తిగత అవయవాలను వర్ణించడానికి ఎలాంటి సంబంధం లేదని హోంశాఖ తెలిపింది.
ఇది కేవలం మహిళలకే పరిమితం కాదని... లైంగిక దాడులు పురుషులపై, ట్రాన్స్ జెండర్లపై కూడా జరుగుతుంటాయని అలాంటి సమయాల్లో కూడా ఇవే నియమాలు వర్తిస్తాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఇవే మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కేంద్రహోంశాఖ విజ్ఞప్తి మేరకు చండీఘడ్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీ ఈ మార్గదర్శకాలను రూపొందించింది. ఈ మార్గదర్శకాలను ఆయా రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీల హోమ్శాఖ కార్యదర్శులకు పంపించడం జరిగిందని సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీ డైరెక్టర్ డాక్టర్ ఎస్.కే. జైన్ తెలిపారు. వీరితో పాటుగా డీజీపీలకు , బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్స్పెక్టర్ జనరల్, మహిళా రక్షణ విభాగం వారికి కూడా పంపించినట్లు డాక్టర్ ఎస్.కే.జైన్ తెలిపారు.