నోయిడా ట్విన్ టవర్ల కూల్చివేత విజయవంతమేనా? సూపర్ టెక్ సంస్థకు నష్టమెంతంటే?
న్యూఢిల్లీ:నోయిడాలో ట్విన్ టవర్స్ కూల్చివేసిన తర్వాత ఆ ప్రాంతమంతా పూర్తిగా దుమ్ముధూళితో కప్పివేయబడింది. దీంతో స్థానికులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ భవనాలు కూల్చే ముందుగానే అక్కడి ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ టవర్లను కూల్చివేశారు. స్థానిక ప్రజలు మాస్కులు ధరించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్పారు. దుమ్ము, ధూళి, భవన వ్యర్థాలను తొలగించే పనిలో పడింది యంత్రాంగం.
Recommended Video
ట్విన్ టవర్ల కూల్చివేత.. బెంబేలెత్తించిన వ్యక్తి గాఢ నిద్రలో
ఈ టవర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు 7వేల మందిని అక్కడ్నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2500 వాహనాలను ఇతర ప్రాంతాలకు తరలించి పార్కింగ్ చేయించారు. ఆదివారం ఉదయం 7గంటల్లోపు అందరూ ఖాళీ చేయాలని అధికారులు ముందుగానే హెచ్చరించారు. అయితే, ఓ నివాసి మాత్రం ఖాళీ చేయకుండా అధికారులను బెంబేలెత్తించాడు. గాఢ నిద్రలో ఉన్న ఆ వ్యక్తిని సెక్యూరిటీ గార్డును పంపించి అక్కడ్నుంచి ఖాళీ చేయించారు.
ట్విన్ టవర్ల కూల్చివేతతో సూపర్టెక్కు రూ. 500 కోట్ల నష్టం
కాగా, ఈ ట్విన్ టవర్స్ కూల్చివేత ద్వారా తమ కంపెనీకి రూ. 500 కోట్ల నష్టం వాటిల్లిందని సూపర్ టెక్ ఛైర్మన్ ఆర్కే అరోడా తెలిపారు.స్థలం, టవర్ల నిర్మాణం కోసం తాము చేసిన ఖర్చుతో పాటు ప్రాజెక్టు అనుమతి కోసం అధికారులకు చెల్లించిన ఛార్జీలు, కొన్నేళ్లుగా చెల్లిస్తున్న వడ్డీలు, ఈ టవర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి 12 శాతం వడ్డీతో కలిపి తిరిగి చెల్లించిన మొత్తం, ఇతర ఖర్చులు, అంతా కలిపి రూ. 500 కోట్ల నష్టం వాటిల్లిందని వివరించారు. అయితే, ఈ ట్విన్ టవర్లలోని దాదాపు 900 అపార్ట్ మెంట్ల ప్రస్తుతం మార్కెట్ విలువ రూ. 700 కోట్లకుపైనే ఉంటుందని అంచనా.
నోయిడా ట్విన్ టవర్ల కూల్చివేత ఖర్చు ఎంతంటే?
మరోవైపు, ఈ ట్విన్ టవర్లను కూల్చివేసేందుకు అయిన ఖర్చు గురించి చెబుతూ.. రూ. 100 కోట్ల ఇన్సూరెన్స్ కవర్కు ప్రీమియం మొత్తంతో కలిపి సూపర్ టెక్ సంస్థ ఈ ట్విన్ టవర్లను సురక్షితంగా కూల్చేందుకు ఎడిఫిస్ ఇంజినీరింగ్ సంస్థకు రూ. 17.5 కోట్లు చెల్లిస్తోందని, కూల్చివేత అనంతరం ఖర్చులకుగానూ అదనంగా ఉంటాయన్నారు. ఈ కూల్చివేతల ప్రభావం తమ ఇతర ప్రాజెక్టులపై ఉండదని సూపర్ టెక్ సంస్థ తెలిపింది.
నోయిడా ట్విన్ టవర్ల పేల్చివేత విజయవంతం
ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే ఎత్తుగా సూపర్ టెక్ సంస్థ నోయిడాలో అక్రమంగా నిర్మించిన జంట భవనాలు కూల్చివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ట్విన్ టవర్ల కూల్చివేత కోసం 3700 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించారు. వీటిని కూల్చివేసేందుకు రూ. 20 కోట్లు ఖర్చు చేశారు. కాగా, ఈ ట్విన్ టవర్ల కూల్చివేత 100 శాతం విజయవంతమైందని ఈ ప్రక్రియ చేపట్టిన ఎడిఫిస్ ఇంజినీరింగ్ సంస్థ తెలిపింది. రెండు భవంతులు నేలమట్టమైన అనంతరం సంస్థ ప్రతినిధి చేతన్ దత్తా వెల్లడించారు. చుట్టుపక్కల భవనాలకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. ఎమరాల్డ్ కోర్టు నివాసానికి కూడా ఎంటి నష్టం వాటిల్లలేదన్నారు. అయితే, ప్రహారీ స్వల్పంగా దెబ్బతింది. 30-35 ఎడిఫిస్ సిబ్బంది, ఏడుగురు విదేశీ నిపుణులు కూల్చివేత ప్రక్రియలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.