ఉత్తర కర్ణాటక బంద్, గోవా ఎఫెక్ట్, బెంగళూరులో ర్యాలీతో ట్రాఫిక్, హైదరాబాద్ !
బెంగళూరు: మహాదాయి తాగునీటి పథకం అమలు చెయ్యడానికి కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు పిలుపు ఇచ్చిన ఉత్తర కర్ణాటక్ బంద్ కు ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారు. బుధవారం ఉత్తర కర్ణాటకలో వాహన సంచారం పూర్తిగా స్థంభించింది. మహారాష్ట్ర, గోవా, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లే అన్ని బస్సు సర్వీసులు పూర్తిగా నిలిపివేశారు.

వాహన సంచారం !
ఉత్తర కర్ణాటక నుంచి అనేక ప్రాంతాలకు వెళ్లే కేఎస్ ఆర్ టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాల సంచారం పూర్తిగా స్థంభించింది. కేఎస్ఆర్ టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కర్ణాటక ప్రభుత్వం
బెళగావి, గదగ్, హుబ్బళి-దారవాడ తదితర ప్రాంతాల్లో రైతులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. స్థానికులు, కన్నడ సంఘాల నాయకులు, కార్యకర్తలు రైతులకు మద్దతుగా రోడ్ల మీద ధర్నా చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం నిర్లక్షతీరుపై రైతులు మండిపడుతున్నారు.

బీజేపీ, కాంగ్రెస్ ద్రోహం !
గోవాలో అధికారంలో ఉన్న బీజేపీ, అక్కడి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మక్కు అయ్యి ఉత్తర కర్ణాటక ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. బెళగావిలోని చెన్నమ్మ సర్కిల్ నుంచి జిల్లాధికారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు.

స్యాండిల్ వుడ్ మద్దతు
బెంగళూరులో కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో స్యాండిల్ వుడ్ కు చెందిన ప్రముఖులు సమావేశం అయ్యి ఉత్తర కర్ణాటక ప్రజలు మహాదాయి తాగునీటి పథకం కోసం చేస్తున్న ధర్నాకు సంపూర్ణమద్దతు ప్రకటించారు.

కన్నడ సినీ ప్రముఖులు !
ప్రముఖ హీరో శివరాజ్ కుమార్ ఆధ్వర్యంలో కన్నడ చలనచిత్ర నిర్మాతల మండలి, దర్శకుల సంఘం, నటీనటుల సంఘం, కార్మిక సంఘం నాయకులు సమావేశం అయ్యారు. రైతులు చేస్తున్న మహాదాయి తాగునీటి పథకం పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

గోవాకు వ్యతిరేకంగా !
ఉత్తర కర్ణాటకలో సినిమా ప్రదర్శనలను పూర్తిగా నిలిపివేసి రైతులకు మద్దతు ప్రకటించారు. రహదారుల మీద టైర్లు వేసి నిప్పంటించి కర్ణాటక, గోవా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెంగళూరులోని బీజేపీ ప్రధాన కార్యాలయం మట్టడించిన రైతులు ధర్నా నిర్వహించారు.

దద్దరిల్లిన బెంగళూరు
బెంగళూరులో చేపట్టిన చలో రాజ్ భవన్ ర్యాలీలో వేలాధి మంది రైతులు, కన్నడ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాజ్ భవన్ సమీపంలో ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో రైతులు వాగ్వివాదానికి దిగారు. రైతుల ధర్నాతో బెంగళూరు నగరంలో పలుప్రాంతాల్లో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

హీరో ఉపేంద్ర !
బహుబాష నటుడు, కర్ణాటక జనతా పార్టీ వ్యవస్థాపకుడు ఉపేంద్ర ఉత్తర కర్ణాటక బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మొత్తం మీద ఉత్తర కర్ణాటక బంద్ కు కర్ణాటకలోని అనేక ప్రాంతాల రైతులు, కన్నడ సంఘాలు మద్దతు తెలిపి నిరసన వ్యక్తం చేసి ధర్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications