సీటు నచ్చలేదని ఎమ్మెల్యే హంగామా, గంటపాటు ఆగిన రైలు
ముంబై: మహారాష్ట్రలో ఓ ప్రజాప్రతినిధి తనకు నచ్చిన సీటు కావాలని డిమాండ్ చేస్తూ.. రైలును గంటపాటు ఆపివేయించాడు. ఈ సంఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ ప్రజాప్రతినిధి తీరుతో రైలులోను ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడవలసి వచ్చింది.
ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగింది. దేవగిరి ఎక్స్ప్రెస్ రెండువేల మంది ప్రయాణికులతో బయల్దేరింది. అయితే ట్రైన్ ముంబై చేరుకోగానే నాందేడ్ శివసేన ఎమ్మెల్యే హేమంత్ పాటిల్ హల్చల్ చేశారు. ఎమ్మెల్యేకు 2వ ఏసీ కోచ్లోని 35, 36 సీట్లు కేటాయించారు.
అయితే అవి సైడ్ సీట్లని, అందులో తాము కూర్చునేది లేదని తేల్చి చెప్పారు. నానా హంగామా చేశాడు. ఎమ్మెల్యే వర్గీయులు రైలు చైన్ లాగారు. దీంతో ఆ రైలు దాదాపు గంట పాటు నిలిచిపోయింది. రైల్వే అధికారులు బుజ్జగించి, వేరే సీట్లు కేటాయించడంతో కచ్చితంగా 56 నిమిషాల తర్వాత పరిస్థితి సద్దుమణిగింది.
అయితే రైల్వే జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ మాత్రం ఈ ఘటనకు ప్రయాణికులనే బాధ్యులను చేయడం గమనార్హం. ఎవరో కొంతమంది ప్రయాణికులు చైన్ లాగారని, అందుకే గంటపాటు రైలు నిలిచిపోయిందని చెప్పారు. ప్రయాణికులు ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని వల్ల రెండు మూడు ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి.