నవాజ్ షరీఫ్తో భేటీ కాలేదు కదా!: ప్రధాని మోడీతో సమావేశంపై ఉద్ధవ్ థాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే సోమవారం భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన మాట్లాడారు. మోడీతో తన భేటీ పూర్తిగా వ్యక్తిగతమైనదని, ఎలాంటి రాజకీయ కారణాలులేవన్నారు. తనకు ప్రధాని మోడీకి మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పారు. తాము దూరమైంది రాజకీయాల్లో మాత్రమేనని అన్నారు.
తాను కలవడానికి వెళ్లింది నవాజ్ షరీఫ్(పాకిస్థాన్ మాజీ ప్రధాని) కాదని, మనదేశ ప్రధాని నరేంద్ర మోడీతో వ్యక్తిగతంగా భేటీ అవడంలో తప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. కాగా, తౌక్టే తుఫాను నష్టం, మరాఠా రిజర్వేషన్లపైనే థాక్రే.. మోడీతో చర్చలు జరపనున్నట్లు వీరిద్దరి భేటీ ముందు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ అంశాలపైనా నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
మరాఠా వర్గాన్ని సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గంగా ప్రకటించాలని ఉద్ధవ్ థాక్రే ఇటీల ప్రధాని మోడీకి లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే. కాగా, మరాఠాలు, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినట్లు స్పష్టమైన ఆధారలేవీ లేవని, వారికి 16 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఇటీవల వ్యాఖ్యానించింది. విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.
ఇటీవల మరాఠా రిజర్వేషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. అలా రిజర్వేషన్లు కల్పించే హక్కు కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఈ విషయంపై ఢిల్లీలో కేంద్రం ప్రభుత్వంతో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు మే 31న శివసేన అధికారిక పత్రిక సామ్నాలో ఓ కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలోనే ఉద్ధవ్ థాక్రే ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.