అదొక్కటే కాదు.. చాలా విషయాల్లో రజనీది మౌనమే: కమల్ హాసన్
చెన్నై: తమిళ రాజకీయాల్లో మార్పు కోసం బయలుదేరిన రజనీకాంత్.. కమల్ హాసన్.. ఎవరి మార్గాన్ని వారు అనుసరిస్తున్నారు. కమల్ హాసన్ కాస్త దూకుడుగా ముందుకెళ్లాలని కనిపిస్తుంటే.. రజనీ మాత్రం నిధానంగానే ఉన్నారు.
ఈ నేపథ్యంలో కమల్ హాసన్ రజనీకాంత్ వైఖరిపై విమర్శలు చేయడం గమనార్హం. కమల్ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా.. జర్నలిస్టులు కావేరీ జలాల గురించి ప్రస్తావించారు. రజనీ దీనిపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.
స్పందించిన కమల్.. అదొక్కటే కాదు చాలా విషయాలపై రజనీపై స్పందించడం లేదని బదులిచ్చారు. ఒక్క విషయాన్నే తీసుకుని మనం రజనీపై మాట్లాడలేమని, చాలా విషయాల్లో ఆయన వైఖరేంటో ఇంకా వెల్లడి కాలేదని అన్నారు.
కాగా, కమల్ ద్రవిడ రాజకీయ వారసత్వాన్ని భుజానికెత్తుకుంటే.. రజనీ మాత్రం ఆధ్యాత్మిక రాజకీయ మార్గాన్ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. మక్కల్ నీది మయ్యం పేరుతో పార్టీ స్థాపించిన కమల్.. కార్యాచరణపై దృష్టి సారించగా.. రజనీ మాత్రం ఇంకా పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగనే లేదు.