గోపాలకృష్ణ గాంధీ కూడా నో.. రాష్ట్రపతి పదవీకి మూడో వ్యక్తి నో..
విపక్షాలకు రాష్ట్రపతి అభ్యర్థి దొరకడం లేదు. తొలుత శరద్ పవార్ నో అన్నారు. తర్వాత ఫరూక్ అబ్దుల్లా కూడా పోటీ చేయబోనని తెలిపారు. ఇప్పుడు గాంధీ మనమడు గోపాలకృష్ణ గాంధీ వంతు వచ్చింది. ఆయన కూడా తాను పోటీ చేయబోనని తెలిపారు. దీంతో వరసగా మూడో వ్యక్తి కూడా పదవీకి పోటీ చేయనని చెప్పారు. దీంతో ఎవరినీ బరిలోకి దింపాలా అని విపక్షాలు ఆలోచిస్తున్నాయి.

మూడో వ్యక్తి నో..
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థి దొరకక విపక్షాలు తలపట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల్లో పోటీ చేయలేమని ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తేల్చిచెప్పారు. ఇప్పుడు మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారు. విపక్షాలు అనుకున్న ముగ్గురు వ్యక్తులు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేశారు.

గౌరవమే కానీ..
దేశ అత్యున్నత పదవీకి పోటీ చేయాలని చాలా మంది గొప్ప నేతలు తనను అడగడం గౌరవంగా భావిస్తున్నానని గోపాలకృష్ణ చెప్పారు. వారికీ కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని విపక్షాల ఐక్యతతో పాటు యావత్ దేశ ఏకాభిప్రాయాన్ని సాధించే వ్యక్తి అయి ఉండాలని అనిపించిందని చెప్పారు. తనకంటే మెరుగైన వ్యక్తులు ఉన్నారనిపించిందని తెలిపారు. అందుకే తాను పోటీ చేయాలనుకోవడం లేదని తెలిపారు. గోపాలకృష్ణ గాంధీ పేరును పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

18న పోలింగ్
రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ను ఈ నెల 15న జారీ చేశారు. ఆ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యింది. ఈ నెల 29 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని, 30న నామినేషన్ల పరిశీలన ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. జులై 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ను జులై 18న నిర్వహిస్తామని.. జులై 21న ఓట్ల లెక్కిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications