మాయావతి సన్నిహితుడి రూ.196కోట్ల ఆస్తులు అటాచ్
లక్నో: జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) మనీ లాండరింగ్ కేసులో బహుజన సమాజ్ వాది పార్టీ (బిఎస్పీ) అధ్యక్షురాలు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి షాక్ తగిలింది.
మాయావతి సన్నిహిత అనుచరుడు బాబు సింగ్ కుష్వాలాకు చెందిన రూ.196 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. కుష్వాలా ఉత్తర్ప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రయివేటు సంస్థలన్నీ ఒక్కటై కాంట్రాక్టులు పొందడానికి సహకరించారని ఈడీ పేర్కొంది.
ఇప్పటికే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) మాయావతిని ప్రశ్నించేందుకు సిద్ధమైంది. ఇప్పుడు తన అనుచరుడికి చెందిన రూ.196 కోట్ల విలువైన ఆస్తులను ఈడి అటాచ్ చేసింది. ఈ కుంభకోణం 2007 - 2012 మధ్య జరిగింది.

ఈ కుంభకోణానికి సంబంధించి ఈడి 2012లో లక్నోలో క్రిమినల్ కేసును నమోదు చేసింది. సిబిఐ ఎఫ్ఐఆర్లను పరిగణలోకి తీసుకొని ఆ తర్వాత 14 వేర్వేరుకేసులు నమోదు చేసింది. ఇందులో నిందితుల్లో కుష్వాహ తదితరులు ఉన్నారు. ఇంతకుముందు కుష్వాహకు చెందిన రూ.60 కోట్లను ఈడి అటాచ్ చేసింది.
ఇదిలా ఉండగా, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్ హెచ్ఎం) కుంభకోణంలో అనవసరంగా తన మీద దర్యాప్తు చేయిస్తున్నారని, అయినా తాను భయపడనని మాయావతి బుధవారం అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కావాలనే ఈ కుంభకోణంలో తన మీద దర్యాప్తు చేయించడానికి సిద్దం అయ్యిందని ఆరోపించారు. ఢిల్లీలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తన మీద రాజకీయ కక్ష సాధించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని అన్నారు.












Click it and Unblock the Notifications