నేతాజీ అక్కడుంటే భారత్ ముక్కలయ్యేది కాదు ! అజిత్ ధోవల్ సంచలన వ్యాఖ్యలు..
భారత స్వాతంత్రోద్యమం, ఆ తర్వాత అఖండ భారత్ గురించి జాతీయ భద్రతా దారు అజిత్ ధోవల్ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఇవాళ జరిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ధోవల్ స్వాతంత్ర పోరాటంతో పాటు నేతాజీ, మహాత్మాగాంధీ వంటి నేతలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో దేశ విభజనకు సంబంధించి ధోవల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
భారత్ స్వాతంత్ర్యం సాధించుకున్న తర్వాత నేతాజీ అక్కడే ఉండి ఉంటే దేశ విభజన జరిగేది కాదంటూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ జాతిపితగా పరిగణించే మొహమ్మద్ అలీ జిన్నా కూడా తాను అంగీకరించే ఒకే ఒక్క నాయకుడు సుభాష్ చంద్రబోస్ అని చెప్పినట్లుగా ధోవల్ వెల్లడించారు. అలాగే మహాత్మాగాంధీ స్ధానంలో బోస్ ఉండుంటే బ్రిటీష్ వాళ్లను స్వాతంత్ర్యం కోసం అడుక్కునే వారు కాదన్నారు.

దేశచరిత్రను తిరగరాసేలా ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేయడం సంతోషకరమని అజిత్ ధోవల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో సిద్ధంగా లేనందునే భారత్ ఓడిపోయిందని ధోవల్ పేర్కొన్నారు. 1950 నుండి 1962 వరకు మనకు స్వాతంత్ర్యం వచ్చినందున సైన్యాన్ని రద్దు చేయాలనే ఆలోచన ఉండేదన్నారు. అందుకే సైన్యంతో పాటు తగిన యుద్ధ సామాగ్రి కూడా అందుబాటులో లేదని, అందుకే చైనాతో యుద్ధం ఓడిపోయామన్నారు.
భారతదేశంలో ముందు నుంచీ అన్నీ ఉన్నాయని, నాణ్యతగల ప్రజలు, ఎక్కువ విద్యావంతులు ఉన్నారని, కానీ రక్షణ మాత్రం లేదన్నారు. అందుకే చొరబాటుదారులు హన్స్, మంగోలు, మొఘలులు ప్రతిరోజూ ఒక్కొక్కరుగా ఇక్కడకు వచ్చారని ధోవల్ వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీని సవాలు చేసే ధైర్యం నేతాజీకి ఉండేదని, గౌరవంతో ఆయన మహాత్మా గాంధీకి సహకరించారన్నారు.












Click it and Unblock the Notifications