ఎన్టీపీసీలో పేలుడు: 8 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలి ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్లో బుధవారం బాయిలర్ పైపు పేలిన ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో వంద మందికి పైగా గాయపడ్డారు.
రాయ్బరేలి: ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలి ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్లో బుధవారం బాయిలర్ పైపు పేలిన ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో వంద మందికి పైగా గాయపడ్డారు.
పవర్ ప్లాంట్లోని ఆరో యూనిట్లో ఈ పేలుడు సంభవించింది. బాయిలర్ పైప్ తెరిచిన వెంటనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ పేలుడు వార్తను రాయ్బరేలి జిల్లా మేజిస్ట్రేట్ కూడా ధ్రువీకరించారు.

మరోవైపు ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే.. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం తొమ్మిది మంది మృతి చెందినట్లు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. పేలుడు జరిగే సమయంలో ప్లాంట్లో 150 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా ప్రస్తుతం ప్లాంట్ లోపలికి ప్రవేశించేందుకు ఎవరినీ అనుమతించడం లేదు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి..
ఎన్టీపీసీ పేలుడు ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందిగా రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శిని సీఎం యోగి ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25 వేలు పరిహారాన్ని ఇస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications