అమెరికాకు మోడీ: కేంద్రంలో నెంబర్ 2 రాజ్నాథ్
న్యూఢిల్లీ: కేంద్రంలో నెంబరూ టూ ఎవరనేది తేలిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించేది కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రభుత్వానికి అధినేతగా, మంత్రివర్గాన్ని నడిపించే బాధ్యుడిగా రాజ్నాథ్ సింగ్ వ్యవహరిస్తారని కేంద్ర కేబినెట్ కార్యదర్శి నిర్ధారించారు.
ప్రధాని దేశంలోని లేని సమయంలో కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రివర్గానికి కూడా ఇంచార్జీగా రాజ్నాథ్ సింగ్ వ్యవహరిస్తారని ఓ ప్రకటనలో తెలిపారు. ఇంతకు ముందు ప్రధాని జపాన్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా రాజ్నాథ్ సింగే ఆ బాధ్యతలు నిర్వహించారు. అయితే, అప్పుడు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. తొలిసారి ఇప్పుడు అధికారికంగా ప్రకటన వెలువడింది.
అమెరికా పర్యటనలో మోడీ ప్రపంచ దృష్టిని ఆకర్షించనున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తారు. ప్రపంచ దేశాధినేతలతో పలు ద్వైపాక్షిక సమావేశాలు జరగనున్నాయి.
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో నరేంద్ర మోడీ హిందీలో ప్రసంగించే అవకాశం ఉంది. ఐక్య రాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో హిందీలో మాట్లాడిన తొలి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కావడం విశేషం.