ప్రియుడి పొందు కోసం నర్సు దురాగతం: బాత్రూంలో మహిళల వీడియోలు తీసి పంపింది, అతడు..
బెంగళూరు: ప్రియుడి పొందు కోసం ఓ మహిళ సభ్యసమాజం తలదించుకునే పనిచేసింది. నర్సుగా పనిచేసే ఆ మహిళ.. తన ప్రియుడికి తోటి ఉద్యోగిణిలు స్నానం చేస్తుండగా వీడియోలు తీసి పంపింది. చివరకు ఆమె పాపం పండి కటకటాలపాలైంది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటు చేసుకుంది.
రాంగ్కాల్ తో పరిచయం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన నర్సు అశ్వినికి ఓ రాంగ్ కాల్ ద్వారా తమిళనాడు వెల్లూరుకు చెందిన ప్రభు అనే చెఫ్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత రెండు మూడు సార్లు కలుసుకున్నారు కూడా.
అసలు బండారం తెలియడంతో..
అయితే, ఆమెకు ఇదివరకే రెండు సార్లు వివాహమైందని, విడాకులు కూడా తీసుకుందని ప్రభుకు తెలిసింది. దీంతో అతడు ఆమెను దూరం పెడుతున్నాడు. ఈ క్రమంలో అతడ్ని దూరం చేసుకోలేని ఆమె.. అతడు ఏది చెబితే అది చేసింది. ఆమెకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలు పంపాలని కోరడంతో పలుమార్లు పంపింది.
సహోద్యోగుల బాత్రూం వీడియోలు తీసి..
అయితే, ఆ వీడియోలు తనకు బోర్ కొడుతున్నాయని ప్రభు చెప్పడంతో.. ఆమె తన తోటి ఉద్యోగిణులు స్నానం చేస్తున్నప్పుడు తీసిన వీడియోలను అతనికి పంపడం మొదలుపెట్టింది. కాగా, ఓ రోజు బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్లిన ఓ ఉద్యోగిని అక్కడ కిటికీ దగ్గర సెల్ ఫోన్ ఉండటం గమనించింది.
ఆ వీడియోలను అమ్ముకున్న ప్రియుడు
అశ్విని సెల్ఫోన్ అని తెలుసుకుని ఆమెను గట్టిగా ప్రశ్నించింది. దీంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది అశ్విని. ఆ తర్వాత ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. బండారం బట్టబయలు కావడంతో ప్రభును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దుర్మార్గుడు నర్సుల వీడియోలను ఆన్లైన్లో అమ్మేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.